రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 నుంచి మాసబ్‌ట్యాంక్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్‌కృష్ణా, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌..

Update: 2022-05-02 05:30 GMT

హైదరాబాద్ : రంజాన్ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా చార్మినార్ ఏరియాలో పండుగ వాతావరణం నెలకొంది. రేపు రంజాన్ పర్వదినం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రంజాన్ ప్రార్థ‌నల నేప‌థ్యంలో రేపు ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1 వైపు వచ్చే వాహనాలు అయోధ్య, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్, తాజ్‌కృష్ణా మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 నుంచి మాసబ్‌ట్యాంక్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్‌కృష్ణా, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే లక్టీకాపూల్‌ నుంచి రోడ్‌ నంబర్‌ 1/12 వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు అయోధ్య, నిరంకారి, చింతల్‌బస్తీ మీదుగా వెళ్లాల‌ని తెలిపారు. ఈద్గా మీరాలం ట్యాంక్‌ వైపు ప్రార్థనల కోసం వచ్చే వాహనాలు పురానాపూల్, కిషన్ బాగ్, బహదూర్ పురా చౌరస్తా మీదుగా వెళ్లాల‌ని పోలీసులు సూచించారు.
రంజాన్ ప్రార్థనల నేపథ్యంలో.. సైకిళ్లు, రిక్షాలను ఈద్గా క్రాస్‌ రోడ్స్‌ దాటి వెళ్ల‌నివ్వ‌బోమ‌ని పోలీసులు తెలిపారు. శివరాంపల్లి, నేషనల్‌ పోలీసు అకాడమీ వైపు నుంచి బహదూర్‌పురా వచ్చే వాహ‌నాల‌ను ధనమ్మ గుడిసెలు ఉండే టీ-జంక్షన్‌ నుంచి ఆలియాబాద్, తాడ్‌బండ్, బాయిస్‌ టౌన్‌ హైస్కూల్‌ మీదుగా మ‌ళ్లిస్తామ‌ని చెప్పారు. రంజాన్ వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచారు.



Tags:    

Similar News