Telangana : సైబర్ నేరస్థులపై నిఘా.. తెలంగాణ పోలీసుల విన్నూత్న నిర్ణయం
తెలంగాణలో సైబర్ మోసగాళ్ల అక్రమాలను అదుపులో ఉంచేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలు ప్రారంభించింది
హైదరాబాద్ పోలీసు అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సైబర్ మోసగాళ్లు తమ ఇష్టం వచ్చినట్లు అక్రమాలకు పాల్పడకుండా వారిని అదుపులో ఉంచేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలు ప్రారంభించింది. సైబర్ నేరాల్లో పదే పదే పాల్గొంటున్నవారి మీద నిఘా ఉంచడమే కాకుండా, హిస్టరీ షీట్లు తెరవాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ స్టేషన్లలోని ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలకు మెమో పంపించారు.
పదే పదే మోసాలకు పాల్పడుతున్నవారిపై...
సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టి, వారి అక్రమ కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నేరాలకు పాల్పడినవారిలో చాలా మంది మళ్లీ మళ్లీ అదే నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. అందుకే వారిపై నిఘా పెంచి, హిస్టరీ షీట్లు నిర్వహించాలని నిర్ణయించారు. అనుమానితులు, పదే పదే సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రికార్డుల్లో షీట్లు తెరిచి, వారి కదలికలపై కంటివేయాలని సూచించారు.