హైదరాబాద్ లో సందడి చేస్తున్న ఫార్ములా ఇ కారు

ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఇ రేసింగులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు

Update: 2022-09-26 05:20 GMT

ఫార్ములా ఇ ప్రిక్స్ కారు ట్యాంక్ బండ్ వద్ద ప్రదర్శనకు ఉంచారు. హైదరాబాద్ సైకిల్ విప్లవం 2.0లో భాగంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సెప్టెంబరు 25 ఉదయం పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఎరుపు రంగు ఎలక్ట్రానిక్ కారును ప్రజలకు ప్రదర్శించారు. ఫార్ములా ఇ రేస్ డెమో కారును నగరంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ సందర్శనార్థం ఏర్పాటు చేస్తున్నారు. కారును ట్యాంక్ బండ్ పై ఆదివారం నాడు లాంచ్ చేశారు. మధ్యాహ్నానికి కారును ట్యాంక్ బండ్‌కు తరలించి, కొద్దిరోజుల పాటు అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత నగరంలోని మరో 20 ప్రదేశాలలో ఈ కారును ప్రదర్శించనున్నారు.

దేశంలో మొట్టమొదటి సారిగా 'ఫార్ములా-ఇ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌' కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఎఫ్ఐఏ ఫార్ములా-ఇ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఇ రేసింగులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి హైదరాబాద్‌ కూడా చేరింది. దీనితో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించినట్టయింది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఈ కార్ రేసింగ్ ఉంటుంది. లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ పరిసర ప్రాంతాల్లో ఎంపిక చేసిన 2.3 కి.మీ రోడ్డును ఫార్ములా-ఇ రేసు కోసం ప్రభుత్వం ట్రాక్‌ నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నది. హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించిన మార్గంలో అడ్డుగా ఉన్న వాటిని తొలిగిస్తూ కొత్తగా ట్రాక్‌ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రేసును చూడటానికి 30వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మేనేజింగ్ కమిటీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) మంత్రి కెటి రామారావు ఛైర్మన్‌గా ఉంటారు. ఈ కమిటీలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, దిల్బాగ్ గిల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & టీమ్ ప్రిన్సిపల్ మహీంద్రా రేసింగ్, మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏస్ అర్బన్ రేస్, FIA ప్రతినిధి, ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు, బ్రాండ్‌తో సహా మరో ఆరుగురు సభ్యులు, కమిటీ నిర్ణయించిన రాయబారులు, అరవింద్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ MAUD.. ఇతరులు ఉండనున్నారు. ఈవెంట్ ఏర్పాట్లు, ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష, మార్కెటింగ్, ఔట్రీచ్, ప్రచారం, మీడియా కవరేజ్ & ప్రోటోకాల్, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MAUD అరవింద్ కుమార్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది.


Tags:    

Similar News