కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు వెన్నపూస గోపాల్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు ప్రకటించింది. ఈ మూడు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి వచ్చే మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా వెన్నపూస గోపాల్ రెడ్డి బరిలోకి దిగుతారు.
గోపాల్ రెడ్డి గతంలో భారత సైన్యంలో పారాట్రూపర్గా పనిచేశారు. అలాగే ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వైకాపా మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. ఇదే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం విశేషం.