జాబితా సిద్ధం... జాయినింగ్స్‌కు రెడీ అట

జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల కు ముందు నుంచే పార్టీ పై ఫుల్లుగా ఫోకస్ పెట్టారు.

Update: 2022-08-03 06:26 GMT

జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల కు ముందు నుంచే పార్టీ పై ఫుల్లుగా ఫోకస్ పెట్టారు. వరసగా ఎమ్మెల్యేలతో సమావేశాలు. ఆ తర్వాత ముఖ్య కార్యకర్తలతోనూ సమావేశం కాబోతున్నారు. అయితే మూడేళ్లుగా పార్టీని పట్టించుకోని జగన్ ఈ రెండేళ్లు పాలనతో పాటు పార్టీకి కూడా కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకుని పార్టీని మరింత ముందుకు తీసుకుపోయే వ్యూహరచనలో ఉన్నారు. తాను సంక్షేమ పథకాలను అమలు చేసి బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు.

నియోజకవర్గాల్లో...
కానీ నియోజకవర్గాల్లో నాయకత్వం సరిగా లేకపోతే ఓటు బ్యాంకు కీలకమైన ఎన్నికల సమయంలో చెల్లాచెదురై పోయే ప్రమాదముంది. అందుకే క్యాడర్ తోనూ సమావేశమవుతున్నారు. ఇలా పార్టీని బలోపేతం చేయడంతో పాటు టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేసులతో అనేక మందిని మానసికంగా ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు వినిపించినా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను అనుకున్నట్లు నియోజవకర్గాల్లో పరిస్థితులను బట్టి అక్కడి నేతల ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు.
టీడీపీని వీక్ చేసేందుకు...
కానీ టీడీపీని మరింత వీక్ చేసేందుకు మరో వ్యూహానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ముఖ్యమైన నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారని సమాచారం. అనేక నియోజకవర్గాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ వ్యతిరేకతను టీడీపీ నేతలు సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయి. అయితే వారిలో కొందరికి టీడీపీపై నమ్మకం లేదు. టిక్కెట్ కోసం చివరి నిమిషం వరకూ వెయిట్ చేయాల్సి వస్తుంది. టెన్షన్ పడాల్సి వస్తుంది. అంతేకాకుండా 40 శాతం యువతకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో కొందరు అసహనంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఉన్నా తమకు టిక్కెట్ దక్కే అవకాశం లేదని కొందరు నమ్ముతున్నారు.
ఈ మాసంలోనే...
అలాంటి వారిని పార్టీలోకి తీసుకునేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలిసింది. జగన్ కూడా సిట్టింగ్ లలో చాలా మందిని మారుస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో కొందరు టచ్ లోకి వచ్చారని తెలిసింది. అయితే టిక్కెట్ పై హామీ ఇవ్వకపోయినా జగన్ పై ఉన్న నమ్మకంతో చేరవచ్చని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించారు. జగన్ ను నమ్మివచ్చిన నేతలందరికీ పదవులతో న్యాయం చేశారని, అందుకే చాలా మంది చేరేందుకు ఆసక్తిక కనపరుస్తున్నారని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ శ్రావణ మాసంలో కొందరు చేరే అవకాశముందని కూడా వార్తలు వస్తున్నాయి. జగన్ చెంతకు ఇప్పటికే చేరికలకు చెందిన జాబితా సిద్ధమయిందని, అయితే దానికి జగన్ ఓకే చెప్పాల్సి ఉంది.


Tags:    

Similar News