ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లోని డ్రగ్ ఎడిక్షన్ ట్రీట్ మెంట్ ఆసుపత్రిపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 400 మంది మరణించారని ఆ దేశం పాకిస్థాన్పై ఆరోపించింది. గత నెల చివరలో ప్రారంభమైన ఘర్షణల్లో ఇది పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారితీసిన పరిణామంగా మారింది. ఈ సమయంలో రెండు దేశాల మధ్య సరిహద్దు కాల్పులు, ఆఫ్ఘనిస్తాన్ లోపల వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణకు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పిలుపులకు ఇప్పటివరకు స్పందన లేదు. పాకిస్థాన్ మాత్రం ఆసుపత్రిపై దాడి చేశామని వచ్చిన ఆరోపణలను తిరస్కరించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో కూడా తమ దాడులు జరిగినప్పటికీ ఎక్కడా పౌరులపై లక్ష్యంగా పెట్టలేదని తెలిపింది.
ఆసుపత్రిపై దాడితో...
ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో, రాత్రి సుమారు 9 గంటల సమయంలో కాబుల్లోని 2,000 పడకల ఆసుపత్రిపై దాడి జరిగిందని చెప్పారు. భవనం పెద్ద భాగం ధ్వంసమైందని తెలిపారు. ఇప్పటివరకు 400 మంది మరణించగా, సుమారు 250 మంది గాయపడ్డారని వెల్లడించారు. స్థానిక టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన దృశ్యాల్లో, భవనం అవశేషాల మధ్య అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. భద్రతా సిబ్బంది టార్చ్లతో గాయపడిన వారిని బయటకు తీసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రక్షణ బృందాలు మంటలను అదుపులోకి తెచ్చి మృతదేహాలను వెలికితీసే పనిలో ఉన్నాయని ఫిత్రత్ తెలిపారు.
ఇరు దేశాల మధ్య కాల్పులు...
ఈ దాడికి కొన్ని గంటల ముందు సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఆ ఘటనలో ఆఫ్ఘనిస్తాన్ వైపు నలుగురు మరణించారు. రెండు దేశాల మధ్య ఇటీవలి సంవత్సరాల్లో ఇదే అత్యంత తీవ్రమైన ఘర్షణగా భావిస్తున్నారు.ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ దాడిని ఖండించారు. ఆసుపత్రులు, పౌర ప్రాంతాలపై దాడులు చేయడం ద్వారా భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని పాకిస్థాన్పై ఆరోపించారు.“ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధం. మానవత్వానికి వ్యతిరేకమైన నేరం” అని ఆయన పేర్కొన్నారు.
ఆరోపణలను ఖండించిన పాకిస్థాన్...
పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ప్రతినిధి మోషర్రఫ్ జైదీ, ఈ ఆరోపణలకు ఆధారం లేదని తెలిపారు. కాబుల్లో ఎలాంటి ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో, కాబుల్ మరియు నంగర్హార్ ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై ఖచ్చితమైన వైమానిక దాడులు చేశామని చెప్పారు. రెండు చోట్ల సాంకేతిక మద్దతు కేంద్రాలు, ఆయుధ నిల్వ గోదాములు ధ్వంసమయ్యాయని వివరించారు. “ఆఫ్ఘన్ తాలిబాన్ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద గుంపులకు ఉపయోగపడుతున్న మౌలిక వసతులనే లక్ష్యంగా చేసుకున్నాం” అని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ సమాచారం శాఖ కూడా ముజాహిద్ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపింది. సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదానికి ఆఫ్ఘనిస్తాన్ ఇస్తున్న మద్దతును కప్పిపుచ్చేందుకే ఇవి చేస్తున్నారని ఆరోపించింది. తమ దాడులు ఖచ్చితంగా జరిగాయని, పక్క ప్రభావాలు లేకుండా చూసుకున్నామని పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి ఆందోళన...
ఈ దాడికి కొన్ని గంటల ముందే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలకులను ఉగ్రవాదంపై కట్టడి చర్యలు పెంచాలని కోరింది. పాకిస్థాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద గుంపులకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ తాలిబాన్ తమ దేశంలో దాడులు చేస్తున్నారని చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో అన్ని ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రంగా ఖండించింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యరాజ్యసమితి రాజకీయ మిషన్ను మరో మూడు నెలలు పొడిగించింది.
తాజా ఘర్షణల నేపథ్యం
ఫిబ్రవరి చివరలో పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాటి దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఘర్షణలు కొనసాగుతున్నాయి. గత అక్టోబర్లో ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ ఘర్షణలతో భంగమైంది.పాకిస్థాన్ ఈ పరిస్థితిని ‘తెరవెనుక యుద్ధం’గా ప్రకటించింది. ఈ ప్రాంతంలో అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నందున అంతర్జాతీయంగా ఆందోళన పెరిగింది. ఆదివారం తరార్, 684 మంది ఆఫ్ఘన్ తాలిబాన్ సైనికులను హతమార్చినట్లు తెలిపారు. దీనిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. తమ వైపు నష్టాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఆఫ్ఘన్ రక్షణ శాఖ, 100కు పైగా పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్లు తెలిపింది.పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, గత వారం డ్రోన్లతో దాడి చేసి పౌరులను గాయపర్చడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ రెడ్ లైన్ దాటిందని అన్నారు.