జగన్ తో కుదరని కెమిస్ట్రీ.. రిటైర్‌మెంట్ దిశగా సీనియర్లు

వైసీపీలో రాజకీయ సన్యాసం తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఎక్కువ మంది సీనియర్లలో రాజకీయ నిరాసక్తత కనపడుతుంది.

Update: 2022-09-30 06:42 GMT

ఏ పోస్టుకైనా రిటైర్‌మెంట్ ఉంది. కానీ రాజకీయాల్లో అలా కాదు. తాము బతికి ఉన్నంత వరకూ రాజకీయాలు చేయొచ్చు. ఏజ్ లిమిట్ ఉండదు. ప్రజల ఆశీర్వాదం, తాము ఉన్న పార్టీ హైకమాండ్ ల సహకారం ఉన్నంత కాలం రాజకీయం చేసే వీలుంది. ఎన్నికలలో పోట చేసే అవకాశం ఉంది. ప్రజల్లో మంచి పేరు, నమ్మకమైన క్యాడర్ ఉంటే చాలు రాజకీయాల్లో సాధారణంగా ఎవరూ రిటైర్‌మెంట్ ఆలోచన చేయరు. ఏడు పదుల వయసులోనూ పాలిటిక్స్ ను ఒంటి చేత్తో తిప్పగలిగిన నేతలు అనేక మంది ఉన్నారు. వ్యూహాలు, నియోజకవర్గంలో పట్టు వారి గెలుపోటములను నిర్దేశిస్తాయి.

రాజకీయాల పట్ల అనాసక్తి...
కానీ వైసీపీలో రాజకీయ సన్యాసాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. పాలన చేపట్టి మూడేళ్లు కాలేదు. కానీ ఎక్కువ మంది సీనియర్లలో రాజకీయ నిరాసక్తత పెరిగిపోతుంది. ఎందుకో తెలియదు. వచ్చే ఎన్నికల్లో పోటీకి అనాసక్తి చూపుతున్నారు. వైసీపీలో యువనాయకత్వానికి పెద్దపీట వేయడం, పార్టీ అధినేత జగన్ తో కెమిస్ట్రీ కుదరకపోవడంతో రాజకీయ సన్యాసం వైపు ఎక్కువ మంది దృష్టి సారించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది వైసీపీకి నష్టమా? లాభమా? అన్నది పక్కన పెడితే ఎందుకిలా జరుగుతుందన్న ప్రశ్నకు వైసీపీ క్యాడర్ కూడా సమాధానం లభించడం లేదు.
నాని నుంచి అవంతి వరకూ..
మాజీ మంత్రి పేర్ని నానినే తీసుకుందాం. ఆయన మాటకారి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిదపా మంత్రి పదవిని చేపట్టారు. జగన్ కు అత్యంత ఇష్టుడిగా పేరుంది. ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం చర్చనీయాంశమైంది. తన స్థానంలో ఆయన కుమారుడు పేర్ని కృష్ణను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పోటీ చేస్తారన్న దానిపై ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఈసారి నువ్వే పోటీ చేయాలని నానిని ఆదేశించారు. ఇటీవల జరిగిన గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం అనుమానంగానే కనిపిస్తుంది. ఆయన తన తనయుడు శివనందేష్ ను రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నారు.
మాగుంట వారసుడు...
మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి వారసుడిని కూడా డోన్ నుంచి రంగంలోకి వచ్చే ఎన్నికల్లో దించాలని భావిస్తున్నారు. ఈ ఆలోచనకు కూడా జగన్ నో చెప్పినట్లు తెలిసింది. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా రాజకీయంగా రిటైర్‌మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయన వ్యాపారాల్లోకి తిరిగి వెళ్లాలనుకుంటున్నారో? ఏమో తెలియదు కాని తన వారసుడు మాగుంట రాఘవ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ఈ మధ్య చెప్పేశారు. ఎంపీగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక తాను రాజకీయాలను వదులుకుని తన కుమారుడు రాఘవకు అప్పగించాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకే ఈ మధ్య ఆయన అధిష్టానంతో సంబంధం లేకుండా తన కుమారుడు రాఘవ పోటీ చేస్తారని చెప్పడం ఒంగోలు వైసీపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
బొత్స, ధర్మాన కూడా...
ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ను కలసి తన మనసులో మాట చెప్పినట్లు తెలిసింది. ఇక సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదే బాటలో ఉన్నట్లు తెలిసింది. బొత్స కుమారుడు సందీప్ ను వచ్చే ఎన్నికలలో పోటీ చేయించే ఆలోచనల్లో ఉన్నారు. ఇక ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ మనోహర్ నాయుడు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ధర్మాన రాజకీయ రిటైర్‌మెంట్ తీసుకోనున్నారని చెబుతున్నారు. ఇలా ఎక్కువ మంది నేతలు రాజకీయ రిటైర్‌మెంట్ తీసుకోవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ యువకుడు కావడం, ఆయనతో కలిసి పనిచేయలేకపోవడం ఒక కారణమైతే, తమ కుమారులకు రాజకీయ అరంగేట్రం ఇదే మంచి సమయమని భావించడమూ మరొక కారణంగా చెప్పాలి.


Tags:    

Similar News