ఉగ్రదాడిలో టీవీ నటి మృతి

పాటియాలా ఎన్‌ఐఏ కోర్టు.. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు..

Update: 2022-05-26 04:25 GMT

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించిన తర్వాత శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ హింసాత్మక నిరసనల మధ్య, సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఒక మహిళా టెలివిజన్ నటిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అమ్రిన్ భట్ తీవ్రవాదుల దాడిలో మరణించగా, ఆమె మేనల్లుడు గాయపడ్డాడు. "రాత్రి 8 గంటలకు, జిల్లాలోని చదూరా ప్రాంతంలోని హుష్రూలో ఆమె నివాసానికి సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు" అని ఒక అధికారి తెలిపారు.

జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 7.55 గంటల ప్రాంతంలో హుష్రూ చదూరాలో మహిళపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంట్లోనే ఉన్న ఆమె 10 ఏళ్ల మేనల్లుడి చేతికి కూడా గాయాలయ్యాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. చదూరా ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున, ఉగ్రవాదులు కానిస్టేబుల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు, అందులో అతని 9 ఏళ్ల కుమార్తె గాయపడింది.

పాటియాలా ఎన్‌ఐఏ కోర్టు.. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఈకేసులో దోషిగా తేల్చిన కోర్టు..యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇటీవల తన నేరాన్ని యాసిన్ మాలిక్‌ అంగీకరించారు. దీంతో పాటియాలా ఎన్‌ఐఏ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో మరణ శిక్ష విధించాలని ఎన్‌ఐఏ వాదించింది. ఐతే పాటియాలా కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించింది.

గత 28 ఏళ్లలో ఉగ్ర వాద కార్యకలాపాల్లో తన పాత్ర ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని..ఏ శిక్షకైనా సిద్ధమని యాసిన్ మాలిక్ కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది. ఉగ్ర వాద కార్యకలాపాలకు పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నట్లు కోర్టు దృష్టికి ఎన్ఐఏ తీసుకెళ్లింది. కోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీనగర్‌లో ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాసిన్ మాలిక్ నివాసం సమీపంలో నిఘాను పెంచారు. కశ్మీర్‌లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో అతడిపై 2017లో కేసు నమోదు అయ్యింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద, చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో నిధులు చేకూర్చినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.

Tags:    

Similar News