కామ్రేడ్లపై సీరియస్.. జగన్ బరస్ట్ అయింది అందుకేనా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీ తెలిసినట్లుంది. మూడేళ్ల తర్వాత జగన్ బరస్ట్ అయ్యారు.

Update: 2022-02-08 08:02 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీ తెలిసినట్లుంది. మూడేళ్ల తర్వాత జగన్ బరస్ట్ అయ్యారు. అదీ సమస్యల కోసం పేదల పక్షాన నిలిచే కమ్యునిస్టుల పైన. ఇది నిజంగా ఎవరూ ఊహించనిదే. కమ్యునిస్టు నేతలు నిబద్దతతో ఉంటారు. వారు పేదల పక్షాన పోరాడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత కమ్యునిస్టులు ఎర్రజెండాలను ఇతర అజెండాలకు ఉపయోగిస్తున్నారన్న మాట వాస్తవం. కామ్రేడ్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది కూడా వాస్తవమే.

ప్రజల అజెండా....
గతంలో కమ్యునిస్టులు ప్రజల అజెండాతో పనిచేసేవారు. కానీ ఇప్పుడు కమ్యునిస్టు నేతలు వారి సొంత అజెండాతో పనిచేస్తున్నారు. ఉద్యోగుల సమ్మె విషయాన్ని తీసుకుంటే సమ్మెను విరమింప చేసే దిశగా ప్రభుత్వాన్ని పదే పదే కోరింది వారే. సమ్మె విరమణ జరిగిన తర్వాత వారి అనుబంధ సంఘాల చేత ఉద్యమానికి ఉసిగొల్పుతున్నదీ వాస్తవమే. ఉపాధ్యాయులకు ఏం నష్టం జరిగిందని ఇప్పుడు ఉద్యమానికి రెడీ అయ్యారు. హెచ్ఆర్ఏ తెలంగాణ కంటే ఒక శాతం మాత్రమే తక్కువగా ఉంది. తెలంగాణలో 11 శాతం ఉంటే ఏపీ ప్రభుత్వం పది శాతం ఇచ్చింది.
టీచర్లను ఉసిగొల్పుతూ....
అసలు టీచర్లు వారు ఉద్యోగం చేస్తున్న గ్రామాల్లో ఉంటున్నారా? అంటే లేదు. పట్టణాల్లోనే నివాసం ఉంటూ స్కూళ్లకు వచ్చి పోతున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే తప్పుపడతారు. కానీ హెచ్ఆర్ఏ శ్లాబ్ పెంచాలట. ఫిట్ మెంట్ 30 శాతం కావాలట. ఒక్కో టీచర్ లక్షకు పైగా జీతం డ్రా చేసే వారున్నారు. కానీ వారికి ఈ జీతాలు సరిపోవడం లేదని రోడ్డుపైకి వస్తున్నారట. దీని వెనక కమ్యునిస్టుల ప్రోద్బలం ఉందన్న జగన్ మాటలు యదార్థమే. కష్టకాలంలోనూ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చినా ఏదో ఒక ఇబ్బందులు సృష్టించడంతోనే జగన్ కమ్యునిస్టులపై ఫైర్ అయ్యారు.
ఎవరి పక్షమో....?
పేదల పక్షాన నిలవాల్సిన కమ్యునిస్టులు ఇప్పుడు పెత్తందార్లకు తొత్తుగా మారిపోయారు. ముఖ్యంగా సీపీఐ ఒక అడుగు ముందుకేసింది. ఎర్రజెండాలను తాకట్టు పెట్టేశారు. వారికి కావాల్సింది అధికారమా? కాదు అది దక్కదు. మరి వీరి అజెండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమేనన్న లక్ష్యం కనపడుతుంది. ఇటీవల ఒక సీనియర్ కమ్యునిస్టు నేత ఒక ఛానెల్ లో కూర్చుని జగన్ ను వ్యక్తిగతంగా దూషించడం కూడా ఈ కోపానికి కారణమని చెప్పవచ్చు. నిజమే.. కమ్యునిస్టులకు ప్రస్తుతం ఒక అజెండా లేదు. వారి జెండాను మాత్రం పసుపు పార్టీకి తాకట్టు పెట్టారని జగన్ అన్న మాటలు అక్షర సత్యాలనే చెప్పాలి. కమ్యునిస్టులు ఇప్పటికైనా ప్రజాభిప్రాయం నడచుకోకుంటే ఉన్న కాస్త విలువ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కమ్యునిస్టులు ఇప్పటికే తమ ప్రాభవం కోల్పోయారు. వారి గురించి భవిష్యత్ లో చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడక మానదు.


Tags:    

Similar News