అవును.. వైఎస్ షర్మిల మా పార్టీలోకి వస్తున్నారు : KVP

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

Update: 2023-07-03 02:17 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు వైఎస్ షర్మిల ఈ వార్తలను ఖండించారు. తాను సొంత పార్టీ పెట్టింది ప్రజల కోసం మాత్రమేనని అన్నారు. అంతేకానీ తాను ఏ పార్టీ కోసం పని చేయనని ఇప్పటికే చెప్పేశారు. కానీ ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తారనే రూమర్లకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఖమ్మం సభ ముగించుకుని గత రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ పార్టీలోకి రావడాన్ని కాంగ్రెస్ వాదిగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ నష్టపోయిందని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయాలను ప్రజలు గుర్తిస్తున్నారని కేవీపీ అన్నారు. ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జనగర్జన సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడ్నించి హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చారు.


Tags:    

Similar News