Tiger : వారికి అలెర్ట్.. ఆ ప్రాంతంలో పులి ఉందట
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో సంచరించిన పులి ప్రస్తుతం ములుగు జిల్లాలోకి ప్రవేశించింది
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో సంచరించిన పులి ప్రస్తుతం ములుగు జిల్లాలోకి ప్రవేశించింది. ములుగు జిల్లాలోని తాడ్వాయిలో పెద్ద పులి సంచారం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. నర్సాపూర్ సమీపంలోని గౌరారం వాగువద్ద పులి నీరు తాగేందుకు వచ్చిందని గుర్తించడంతో పెద్ద పులి అక్కడే ఉందని అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు.
పశువుల మేతకు వెళ్లొద్దు...
చౌలౌడు, కేశవపురం గ్రామాల వైపు పులి వెళ్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల అటవీ ప్రాంతంలోకి గ్రామస్థులు ఎవరూ వెళ్లవద్దని, పశువుల మేతకు కూడా అటు వైపు వెళ్లవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే పులి దాడి చేసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళల్లోనూ తమ పెంపుడు జంతువులను బయట వదలవద్దని కూడా సూచించారు.