వెనక్కు తగ్గని మైనంపల్లి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ లో మైనంపల్లి రోహిత్ పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రోహిత్ పోటీ విషయంలో మాటకు కట్టుబడి ఉన్నానని, మాట తప్పేదిలేదని అన్నారు. మల్కాజిగిరిలో తాను కూడా బరిలో ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చి, తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంపై మైనంపల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ‘‘నా మాటకి కట్టుబడి ఉన్నాను.. మాట తప్పను.. మెదక్లో నా కొడుకు కచ్చితంగా పోటీ చేస్తాడు. నేను ఏమి చెయ్యబోయ్యేది మెదక్, మల్కాజిగిరి ప్రజలతో చర్చించి త్వరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ మైనంపల్లి హన్మంత్ రావు స్పష్టం చేశారు.