నోరు పారేసుకున్న ఎమ్మెల్యేపై కేటీఆర్ ట్వీట్

మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్‌ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2023-08-21 12:54 GMT

బీఆర్ఎస్ పార్టీ నేడు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తనను సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. టికెట్ దక్కని అభ్యర్థుల గురించి "ప్రజా జీవితంలో నిరాశా నిస్పృహలు ఎదురవుతుంటాయి. దురదృష్టవశాత్తు క్రిషాంక్ వంటి అర్హులైన, సమర్థులైన నేతలకు జాబితాలో చోటు కల్పించలేదు. క్రిషాంక్ కు, టికెట్ దక్కని ఇతర నేతలకు ప్రజా సేవ చేసేందుకు మరో రూపంలో అవకాశం దక్కేలా చూస్తాను" అని హామీ ఇచ్చారు. మైనంపల్లి పేరును ప్రస్తావించకుండా.. మంత్రి హరీష్ రావుకు మద్దతుగా కేటీఆర్ ట్వీట్ చేశారు. "మా ఎమ్మెల్యేల్లో ఒకరు తన కుటుంబ సభ్యులకు టికెట్ రాకపోవడంతో నోరు పారేసుకున్నారు... మంత్రి హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యే ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాదు, మనందరం హరీశ్ రావుకు బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. హరీశ్ రావు... బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి అందులో అంతర్భాగంగా కొనసాగుతున్న వ్యవస్థాపక సభ్యుడు. పార్టీ ప్రస్థానంలో మున్ముందు కూడా ఆయన మూలస్తంభంలా వ్యవహరిస్తారు" అంటూ మద్దతు తెలిపారు.




అసలేమి జరిగింది:
మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్‌ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. మెదక్‌లో ప్రచారం చేయడానికి హరీశ్ రావు ఎవరు? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్‌గిరి నుంచి నేను, మెదక్ నుంచి నా కుమారుడు రోహిత్ చేస్తామని అన్నారు. తాను కచ్చితంగా మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తామంటూ స్పష్టం చేశారు. తన కుమారుడు కూడా మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారని అన్నారు. ప్రస్తుతానికి తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని.. తనకు ఎప్పుడో టికెట్ కన్ఫామ్ చేశారని అన్నారు. మధ్యలో హరీష్‌ కలుగుజేసుకొని పెత్తనం చెలాయించడం కరెక్ట్ కాదని అన్నారు మైనంపల్లి. అవసరమైతే తన సత్తా ఏంటో చూపిస్తానని.. హరీష్‌ను ఆయన నియోజకవర్గంలో ఓడించేందుకు కూడా వెనకాడబోనని అన్నారు.


Tags:    

Similar News