మూర్ఖత్వం.. వాగులో కారు గల్లంతు

నంగునూరు మండలం అక్కెనపల్లి శివారులోని వాగులో శుక్రవారం రాత్రి ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. అక్కెనపల్లి-బస్వాపూర్

Update: 2023-07-29 04:35 GMT

కళ్లెదుటే ఆపద కనిపించినా.. చుట్టూ ఉన్నవారు అక్కడ ప్రమాదం ఉందని హెచ్చరించినా ఒక్కోసారి మన మూర్ఖత్వం అవేవీ పట్టించుకోదు. అర్జెంటుగా మన పనైపోవాలన్న తొందర ఆపదలోకి నెడుతుంది. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు పూర్తిస్థాయిలో పోలేదు. వాగులు, వంకలు ఇంకా పొంగిపొర్లుతూనే ఉన్నాయి. ఇలాంటపుడే జాగ్రత్తగా ఉండాలి. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఎవ్వరిమాట వినకుండా.. కాజ్ వే పై కారుతో వెళ్లి గల్లంతయ్యాడు. శుక్రవారం రాత్రి సిద్ధిపేట జిల్లాలో జరిగిందీ ఘటన.

నంగునూరు మండలం అక్కెనపల్లి శివారులోని వాగులో శుక్రవారం రాత్రి ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. అక్కెనపల్లి-బస్వాపూర్ మార్గంలో పెద్దవాగుపై ఉన్న కాజ్ వే వద్ద ఈ ఘటన జరిగింది. భారీవర్షాల కారణంగా.. కాజ్ వే పై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. రెండురోజులుగా ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, స్థానికులు ఆ మార్గంలో ఎవరూ వెళ్లకుండా ఓ ముళ్లకంపను అడ్డుపెట్టారు. గతరాత్రి పోరెడ్డిపల్లి నుంచి అప్పిసకాలనీ మీదుగా అక్కెనపల్లి మార్గంలో ఓ కారు వచ్చింది. కాజ్ వే పై ప్రవాహం ఎక్కువగా ఉందని అటు వెళ్లొద్దని స్థానికులు వారించినా వినలేదు.
కాజ్ వే పై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆ కారు వాగులో గల్లంతైంది. రాత్రివేళ కావడంతో కారుకోసం ఎంత వెతికినా కనిపించలేదు. విషయం తెలుసుకున్న రాజగోపాలపేట ఎస్ఐ రాజుగౌడ్ సిబ్బందితో కాజ్ వే వద్దకు వచ్చి ఆరా తీశారు. కారు ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News