శ్రీనగర్ లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ - కాశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు - ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Update: 2021-12-13 12:29 GMT

జమ్మూ - కాశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు - ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ జిల్లాలోని రంగ్రెత్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఆ సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల స్థావరం కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది సైనికులను చూశాడు. వెంటనే బలగాలపై కాల్పులు జరిపాడు.

లొంగిపోయే అవకాశమిచ్చినా....
ఎదురు కాల్పులు జరిపిన భద్రతా బలగాలు.. ఆ ఉగ్రవాదికి లొంగిపోయేందుకు అవకాశమిచ్చారు. అయినప్పటికీ కాల్పులు కొనసాగించడంతో సైనికులు ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఆ వెనుకే వచ్చిన మరో ఉగ్రవాది కూడా కాల్పులు జరుపగా.. ప్రతిగా బలగాలు కాల్పులు జరిపి అతడిని హతమార్చాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ లో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. కానీ మృతులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఇంకా తెలియలేదని, మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కాల్పులతో దద్దరిల్లిన రంగ్రెత్ లో భద్రతను మరింత పటిష్టం చేశారు.


Tags:    

Similar News