మే 2నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

మే 2 నుంచి మూడ్రోజుల పాటు మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు. మే2న జర్మనీకి వెళ్లి.. అక్కడి నుంచి డెన్మార్క్..

Update: 2022-04-28 05:52 GMT

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి మూడ్రోజుల పాటు మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు. మే2న జర్మనీకి వెళ్లి.. అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్తారు. తిరుగు పయనంలో మే4న ప్యారిస్ చేరుకుంటారని మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. విదేశీ పర్యటనలో భాగంగా.. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఈ తర్వాత ఇండియా జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (IGC) 6వ ఎడిషన్‌‌లో ప్రధాని మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.

అనంతరం డెన్మార్క్‌ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్‌హాగన్ వెళ్లనున్నారు. అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాల ప్రధానమంత్రులతో మోదీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్ధిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మే4న ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో ప్యారిస్‌లో ఆగి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇటీవల తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో చర్చలు జరుపుతారు.


Tags:    

Similar News