అమెరికా మిచిగన్లోని ఒక పెద్ద సినగాగ్పై దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి, ఈ నెల ప్రారంభంలో లెబనాన్లో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడితో సంబంధం ఉన్నట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం, మార్చి 5న లెబనాన్లో జరిగిన దాడిలో ఇబ్రహీం ఘజాలి అనే వ్యక్తి మరణించాడు. అతను హిజ్బుల్లా కమాండర్గా పనిచేసి, ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించే యూనిట్కు ఆయుధాలు నిర్వహించేవాడని ఆరోపించింది. ఆ దాడిలో అతని బంధువులు మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అదే కుటుంబానికి చెందిన ఐమన్ మొహమ్మద్ ఘజాలి , ఆ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అమెరికాలో మిచిగన్లోని డెట్రాయిట్ నగర పరిసరాల్లో ఉన్న పెద్ద సినగాగ్పై కారుతో దూసుకెళ్లి దాడి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన తర్వాత అతను తనను తాను కాల్చుకొని మృతి చెందినట్టు పేర్కొన్నారు.
మృతిని ధృవీకరించిన...
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎఫ్బీఐ డెట్రాయిట్ కార్యాలయం, ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఆరోపణలపై వ్యాఖ్యానించలేదు. “దర్యాప్తు కొనసాగుతున్నందున ఇప్పుడే వివరాలు చెప్పలేం,” అని ఎఫ్బీఐ ప్రతినిధి జోర్డన్ హాల్ తెలిపారు. లెబనాన్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి కూడా ఇబ్రహీం ఘజాలి మరణాన్ని ధృవీకరించారు. అయితే వివరాలు బహిరంగంగా చెప్పలేనందున పేరు వెల్లడించలేదని తెలిపారు. ఆ దాడిలో అతని పిల్లలు అలీ, ఫాతిమా, సోదరుడు కాసిమ్ కూడా మృతి చెందినట్టు అసోసియేటెడ్ ప్రెస్కు చెప్పారు. హిజ్బుల్లా విడుదల చేసిన ప్రకటనలో ఇబ్రహీం, కాసిమ్ స్థానిక ఫుట్బాల్ లీగ్లో రిఫరీగా, స్కౌట్ సభ్యుడిగా ఉన్నారని పేర్కొంది. ఇంట్లో ఉన్న సమయంలోనే పిల్లలతో కలిసి లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. అయితే ఇబ్రహీం హిజ్బుల్లా గ్రూపులో ఉన్నాడని స్పష్టంగా ఖండించలేదు. అధికారుల ప్రకారం, కుటుంబ సభ్యులు నలుగురు ఇజ్రాయెల్ దాడిలో మరణించారని తెలుసుకున్న తర్వాత ఐమన్ ఘజాలి సినగాగ్పై దాడి చేశాడు.
రెండు గంటలు వేచి దాడి
గత గురువారం ఐమన్ ఘజాలి డెట్రాయిట్ సమీపంలోని టెంపుల్ ఇజ్రాయెల్ సినగాగ్ బయట కారులో సుమారు రెండు గంటలు వేచి ఉన్నట్టు అధికారులు తెలిపారు. అతని వద్ద రైఫిల్, వాణిజ్య వినియోగానికి ఉన్న పటాకులు, పెట్రోలు అనుమానించే ద్రవంతో ఉన్న డబ్బాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత భవనంలోకి కారును దూసుకెళ్లించి విండ్ షీల్డ్ ద్వారా కాల్పులు జరిపాడు. భద్రతా గార్డు తిరిగి కాల్పులు జరపడంతో ఇద్దరి మధ్య కాల్పులు జరిగాయి. కారు ఇరుక్కుపోయి ఇంజిన్ మంటలు అంటుకున్న తర్వాత ఘజాలి తనను తాను కాల్చుకొని మృతి చెందినట్టు ఎఫ్బీఐ డెట్రాయిట్ విభాగం ప్రత్యేక అధికారి జెన్నిఫర్ రన్యాన్ తెలిపారు. సినగాగ్లో అప్పటికి డజన్ల కొద్దీ పిల్లలు ఉన్నప్పటికీ ఎవరూ గాయపడలేదు. ఇటీవల భద్రతను బలోపేతం చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.ఎఫ్బీఐ ఈ ఘటనను యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న హింసాత్మక దాడిగా పేర్కొంది. అయితే దీన్ని ఉగ్రవాద చర్యగా ప్రకటించేందుకు తగిన ఆధారాలు ఇంకా లభించలేదని తెలిపింది.
అమెరికా పౌరురాలిని వివాహం చేసుకుని...
ఐమన్ ఘజాలి 2011లో అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్న వ్యక్తిగా ఇమ్మిగ్రేషన్ వీసాతో అమెరికాకు వచ్చాడు. 2016లో అతనికి అమెరికా పౌరసత్వం లభించినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. అతను డెట్రాయిట్ సమీపంలోని డియర్బోర్న్ హైట్స్లో ఒక ఇంటిలో నివసించేవాడు. ఆ ప్రాంతం సినగాగ్ ఉన్న చోటుకు సుమారు 40 మైళ్లు దూరంలో ఉంది.ఇదే రోజు వర్జీనియాలోని ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయంలో కూడా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్కు సహాయం చేయాలని ప్రయత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన మాజీ ఆర్మీ నేషనల్ గార్డ్ సభ్యుడు తరగతి గదిలో కాల్పులు జరపగా ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు.