మార్కులు తగ్గాయని కిడ్నాప్ డ్రామా.. తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే

ఇద్దరు కూతుర్లు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని అక్కాచెల్లెళ్ల కోసం

Update: 2023-05-20 13:58 GMT

kolkata girl kidnap

పరీక్షల్లో మార్కులు తగ్గడంతో.. తల్లిదండ్రులు తిడతారని భయపడి ఇంట్లోనుండి వెళ్లిపోయిందో 16 ఏళ్ల విద్యార్థిని. వెళ్తూ వెళ్తూ తనతో పాటు ఆరేళ్ల వయసున్న చెల్లిని కూడా తీసుకెళ్లింది. అంతటితో ఆగకుండా కిడ్నాప్ డ్రామా ఆడి.. తండ్రినే డబ్బులు డిమాండ్ చేసింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్ కతాలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమబెంగాల్ లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు గత శుక్రవారం విడుదలయ్యాయి. నగరంలోని బన్స్ ద్రోణి ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థినికి ఈ ఫలితాల్లో 31 శాతం మార్కులే వచ్చాయి. తక్కువ మార్కులు చూసి తల్లిదండ్రులు మందలిస్తారని భయపడిన ఆ బాలిక.. ఇంట్లో నుండి వెళ్లిపోయి కిడ్నాప్ డ్రామా ఆడింది. మార్కులు చూసుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్తానని చెప్పి చెల్లిని తీసుకుని ఇంట్లో నుండి వెళ్లిపోయింది.
ఇద్దరు కూతుర్లు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని అక్కాచెల్లెళ్లకోసం గాలింపు చేపట్టారు. అదేసమయంలో తండ్రి ఫోన్ కు గుర్తుతెలియని నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. కూతుర్లిద్దరినీ కిడ్నాప్ చేశామని, కోటి రూపాయలు ఇస్తేనే వదిలిపెడతామని ఉంది. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. నదియా జిల్లాలోని ఓ నర్సింగ్ హోం ఎదుట బాలికలు కనిపించారు. విచారణలో అదంతా డ్రామా అని తెలియడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. మార్కులు తక్కువ రావడంతో తానే డ్రామా ఆడినట్లు బాలిక అంగీకరించింది.


Tags:    

Similar News