Congress, BJP : అక్కడ గెలిచామని ఇప్పుడు గెలుస్తామన్న నమ్మకం ఉందా? లేదుగా?

లోక్‌సభకు సాధారణ ఎన్నికలు ఎంతో దూరం లేవు. మరో వందరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి

Update: 2023-12-05 04:03 GMT

లోక్‌సభకు సాధారణ ఎన్నికలు ఎంతో దూరం లేవు. మరో వందరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడోసారి అధికారం మాదేనని బీజేపీ అంటోంది. విపక్షం కాంగ్రెస్ కూడా పదేళ్ల తర్వాత తమకు అధికారం ఇస్తారన్న విశ్వాసంతో ఉంది. ఇండియా కూటమి ఈసారి ఎన్ని స్థానాలు గెలుస్తుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈసారైనా అధికారంలోకి వస్తుందా? లేదా మరో ఐదేళ్లు ప్రతిపక్షానికే పరిమితమవుతుందా? అన్న సందేహాలు కూడా సాధారణంగా అందరి మదిలోనూ మెదులుతున్నాయి.

మూడు రాష్ట్రాలో...
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుపు మాదేనన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినా మిగిలిన చోట్ల మాత్రం కమలం జెండా ఎగరడంతో ఫుల్లు ఖుషీగా ఉంది. మూడోసారి మోదీనే ప్రధాని అని ఇప్పటికే బీజేపీ సోషల్ మీడియాలో హోరెత్తి పోతుంది. కాంగ్రెస్ కూడా పట్టువిడవటం లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ ఎన్నికల్లో తక్కువ స్థానాలు, తక్కువ ఓట్ల శాతంతోనే ఓటమి పాలయ్యామని గుర్తు చేస్తూ తమకు తామే సర్ది చెప్పుకుంటుంది.
గత ఎన్నికల్లో...
అయితే ఇక్కడ ఒకటుంది. మూడు రాష్ట్రాలు గెలిచామని లోక్‌సభ ఎన్నికలలో గెలుస్తామన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ ఎన్నికల్లో మూడింటిలో కాంగ్రెస్ గెలిచింది. కానీ 2019లో మాత్రం తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఉదాహరణతో కాంగ్రెస్ నచ్చ చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో తాము ఓటమి పాలయినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. మొత్తం మీద గెలుపోటములు ఒక ఎన్నికకు.. మరో ఎన్నికకు మారుతుంటాయి. అది ప్రజల మనోభిప్రాయం మీద ఆధారపడి ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News