వాహనదారులకు షాక్.. ఈ వారంలోనే పెట్రో మంట

ఫలితాల అనంతరం పెట్రోల్, డీజిల్ రేట్ల వడ్డన తప్పదంటున్నారు నిపుణులు. నిపుణుల అంచనా ప్రకారం ఈ వారంలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా..

Update: 2022-03-08 07:16 GMT

న్యూ ఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం క్రూడాయిల్ ధరపై పడింది. రోజురోజుకూ క్రూడాయిల్ ధర పెరుగుతుండటంతో పెట్రోల్, డీజిల్ రేట్లు గణనీయంగా పెరుగుతాయని 15 రోజులుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ లో ఎన్నికల కారణంగా కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. క్రూడాయిల్ ధర పెరిగినా.. ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకపోవడానికి కారణం ఎన్నికలే. ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఫలితాల అనంతరం పెట్రోల్, డీజిల్ రేట్ల వడ్డన తప్పదంటున్నారు నిపుణులు. నిపుణుల అంచనా ప్రకారం ఈ వారంలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాకముందు క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు అది 125 డాలర్లకు చేరింది. దాంతో పెట్రోల్ పై సుమారు రూ.15, డీజిల్ పై రూ.22 పెరగవచ్చని తెలుస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.21 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.33గా ఉంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే.. వచ్చే నెల రోజుల్లో లీటరు పెట్రోల్ ధర రూ.150-రూ.155 వరకూ పెరగవచ్చని సంకేతాలొస్తున్నాయ్.


Tags:    

Similar News