మెడికల్ కాలేజీలో 87 మందికి కోవిడ్ పాజిటివ్ !

ఇటీవలే పాట్నాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమం జరుగగా.. ఈ కార్యక్రమంలో అనేకమంది వైద్యులు పాల్గొన్నారు. నలందా

Update: 2022-01-03 06:43 GMT

దేశవ్యాప్తంగా కోవిడ్, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అధికంగా కేసులు నమోదవ్వగా.. బీహార్ కూడా ఆ జాబితాలోకి చేరుపోతోంది. బీహార్ లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అక్కడున్న ఓ మెడికల్ కాలేజీలో ఏకంగా 87 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. పాట్నాలోని నలందా మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో పనిచేస్తోన్న 87 మంది వైద్యులకు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. వీరిలో కోవిడ్ లక్షణాలు తక్కువగానే ఉన్నప్పటికీ.. వారందరినీ ఆస్పత్రి క్యాంపస్ లోనే ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు పాట్నా జిల్లా మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు.

ఇటీవలే పాట్నాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమం జరుగగా.. ఈ కార్యక్రమంలో అనేకమంది వైద్యులు పాల్గొన్నారు. నలందా మెడికల్ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు కూడా వారిలో ఉన్నారు. ఆ కార్యక్రమం తర్వాత వారందరికీ పరీక్షలు చేయగా.. కోవిడ్ గా నిర్థారణ అయినట్లు చంద్రశేఖర్ తెలిపారు. అదే కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. కాగా.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మాల్స్, దుకాణాల్లో భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది బీహార్ ప్రభుత్వం.




Tags:    

Similar News