నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష!!
టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధించింది జనగామ కోర్టు.
టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధించింది జనగామ కోర్టు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతితో పాటు పలువురు గాయపడటానికి కారణమైనందుకు ఈ శిక్ష పడింది. 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అనంతరం లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు మృతి చెందారు. కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.