రెచ్చిపోయిన ఉగ్రమూక.. మసీదులో ఆత్మాహుతి దాడి, 66 మంది మృతి
కాబూల్ మానవబాంబు పేలుడు ఘటనలో ఇప్పటివరకు 66 మంది మరణించగా.. 78 మంది గాయపడ్డారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే..
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలే లక్ష్యంగా వరుస బాంబు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కాబూల్ లోని ఖలీఫా సాహిబ్ మసీదులో ఆత్మాహుతి బాంబు దాడి జరగడంతో 50 మందికి పైగా దుర్మరణం చెందగా.. మరో 100 మందికి పైగా తీవ్రగాయాల పాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. రంజాన్ నెల ఆఖరి శుక్రవారం కావడంతో ఖలీపా సాహిబ్ మసీదు రద్దీగా మారింది. ప్రార్థనలు ముగిసిన అనంతరం భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
మానవబాంబు పేలుడు ధాటికి మసీదులో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఈ పేలుడులో 10 మంది దుర్మరణం చెందగా, మరో 20 మంది గాయపడ్డారని ఆప్ఘానిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ బిస్ముల్లా హబీబ్ వెల్లడించారు. కాబూల్ మానవబాంబు పేలుడు ఘటనలో ఇప్పటివరకు 66 మంది మరణించగా.. 78 మంది గాయపడ్డారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ మారణహోమం వెనుక ఏ ఉగ్రవాద సంస్ధ హస్తం ఉందన్నది ఇంతవరకూ తెలియరాలేదు. కాగా.. గతవారం మజర్ ఈ షెరీఫ్ నగరంలో మసీదుపై జరిగిన బాంబు దాడిలో 33 మంది మృతిచెందారు. ఈ పేలుడుకు ఇస్లామిక్ స్టేట్ తామే కారణమని ప్రకటించుకుంది.