మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసే లక్షణాలు శుక్రవారం కనిపించలేదు. ఇరాన్ నుంచి కాల్పులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. కువైట్, బహ్రెయిన్పై దాడులు జరుగుతున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు. పర్షియన్ నూతన సంవత్సర వేడుకల ముగింపు సందర్భంగా వంతెన సమీపంలో సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు ఇరాన్ తెలిపింది. ఆ వంతెనపై అమెరికా దాడి చేసినట్లు సమాచారం. పొరుగుదేశాలపై దాడి చేసే సామర్థ్యం తనకు ఉందని ఇరాన్ మళ్లీ చూపించింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం నుంచి ముప్పు దాదాపు తీరిపోయిందని వ్యాఖ్యానించారు. గురువారం వంతెన కూలిన దృశ్యాలను ఆయన ప్రశంసించారు. అది మధ్యప్రాచ్యంలోనే ఎత్తైన వంతెనగా చెబుతున్నారు. ఆ వంతెనపై దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. నౌరూజ్ పండుగ చివరి రోజు ప్రకృతి దినోత్సవంగా జరుపుకునే వేడుకల్లో పాల్గొన్న 95 మంది గాయపడినట్లు తెలిపింది.
ఇరాన్ వ్యూహాత్మక బలంతో...
“పౌరుల సదుపాయాలపై దాడి చేయడం శత్రువు నైతిక పరాభవాన్ని మాత్రమే చూపిస్తుంది” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధిపై దాని పట్టుతో ప్రపంచ ఇంధన సరఫరాలు దెబ్బతిన్నాయి. యుద్ధంలో ఇదే ఇరాన్కు ప్రధాన వ్యూహాత్మక బలం అని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆ జలసంధిని తిరిగి తెరవడంపై బ్రిటన్ దాదాపు మూడు డజను దేశాలతో చర్చించింది. హోర్ముజ్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవచ్చని ట్రంప్ అన్నారు. అయితే అది అమెరికా బాధ్యత కాదని చెప్పారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ హోర్ముజ్ నుంచి చమురు మీద ఆధారపడే దేశాలు ధైర్యం చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులతో యుద్ధం ప్రారంభించే ముందు ఈ జలసంధి ద్వారా రవాణా సాధారణంగా సాగేది. ప్రపంచ చమురు వ్యాపారంలో 20 శాతం ఇక్కడి గుండా వెళ్లేది.
దాడులు కొనసాగుతాయంటూ...
ట్రంప్ ప్రసంగానికి ఇరాన్ ధైర్యంగా స్పందించింది. అమెరికా సైనిక చర్యలతో తమ దేశం ఇక ముప్పు కాదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది.ఇరాన్ సైన్యం ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్ఫఘారీ మాట్లాడుతూ తమ వద్ద రహస్యంగా ఆయుధాలు, గోలాబారుద నిల్వలు ఉన్నాయని చెప్పారు. అమెరికా ఇప్పటివరకు లక్ష్యంగా చేసిన కేంద్రాలు పెద్దవి కావని వ్యాఖ్యానించారు. అమెరికా వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తికి చేరువలో ఉన్నాయని ట్రంప్ తన ప్రసంగంలో తెలిపారు. అల్బోర్జ్ ప్రావిన్స్ అధికారులు బీ1 వంతెనపై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఆ వంతెన ఇంకా నిర్మాణంలోనే ఉంది. తన సోషల్ మీడియాలో ఇరాన్లో అతిపెద్ద వంతెన కూలిపోయిన దృశ్యాలను ట్రంప్ పోస్టు చేశారు. “ఇంకా చాలా జరుగుతాయి” అని హెచ్చరించారు. అయితే ఆ వీడియో నిజంగా బీ1 వంతెనదేనా అనేది స్పష్టత లేదు.
హెజ్బొల్లా మిలిటెంట్లపై ...
లెబనాన్లో ఇరాన్కు మద్దతు ఇచ్చే హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ భూదాడులు కొనసాగుతున్నాయి. 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 27 మంది మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్లో 1,900 మందికి పైగా, ఇజ్రాయెల్లో 19 మంది మృతి చెందారు. గల్ఫ్ దేశాలు, వెస్ట్బ్యాంక్లో రెండు డజన్లకు పైగా మరణాలు నమోదయ్యాయి. 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో 1,300 మందికి పైగా మరణాలు, 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అక్కడ 10 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా మృతి చెందారు.
హోర్ముజ్ భద్రతపై...
పర్షియన్ గల్ఫ్ను సముద్రంతో కలిపే ఈ జలసంధిలో ఇరాన్ దాడులు, బెదిరింపుల వల్ల రవాణా దాదాపు నిలిచిపోయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మార్చి 1 నుంచి రవాణా 94 శాతం తగ్గినట్లు లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. కొద్ది నౌకలు మాత్రమే రుసుము చెల్లించి వెళ్లినట్లు పేర్కొంది.సౌదీ అరేబియా మార్చిలో హోర్ముజ్ మార్గాన్ని తప్పించి దాదాపు 100 కోట్ల బ్యారెల్ల చమురును పైప్లైన్ ద్వారా తరలించింది. ఇరాక్ కూడా సిరియా మార్గంగా ట్రక్కుల ద్వారా చమురు తరలింపును ప్రారంభించినట్లు తెలిపింది. గత నెలలో హోర్ముజ్ను అడ్డుకోవడం ఆపాలని 35 దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. అమెరికా తప్ప జీ7 దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ కూడా ఇందులో ఉన్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత జలసంధి భద్రతపై రాజకీయ, దౌత్య చర్యలపై చర్చలు జరిగాయి. అవసరమైతే మైన్ల తొలగింపు చర్యలు కూడా తీసుకోవచ్చని బ్రిటన్ విదేశాంగ మంత్రి య్వెట్ కూపర్ తెలిపారు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో బలవంతంగా జలసంధిని తెరవడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు. దక్షిణ కొరియా పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ దీనిని అవాస్తవమని వ్యాఖ్యానించారు.యుద్ధం ఆగిన తర్వాత కూడా ఇరాన్ రవాణాపై పరిమితులు విధించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
చమురు ధరలు మళ్లీ...
ఈ యుద్ధం కారణంగా చమురు, సహజ వాయువు ధరలు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. పెట్రోలు ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా.అమెరికా ముడి చమురు ధర బ్యారెల్కు 111.54 డాలర్ల వద్ద నిలిచింది. ఇది ఫిబ్రవరి 28తో పోలిస్తే దాదాపు 50 శాతం ఎక్కువ. హోర్ముజ్ మార్గంగా వెళ్లే చమురు ప్రధానంగా ఆసియా దేశాలకు సరఫరా అవుతుంది. అయినా జపాన్, దక్షిణ కొరియా మాత్రమే ఈ చర్చల్లో పాల్గొన్నాయి. విమాన ఇంధన సరఫరాలపై కూడా ప్రభావం పడింది.