ఫ్యాక్ట్ చెక్: పాక్ తో యుద్ధం చేయలేమంటూ భారత ఆర్మీ జనరల్స్ సమావేశం నుండి వెళ్ళిపోతున్నారనేది నిజం కాదు
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి తర్వాత, అనేక పాకిస్తానీ సోషల్ మీడియా ఖాతాలు
By - Satya Priya BNUpdate: 2025-04-28 09:57 GMT
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి తర్వాత, అనేక పాకిస్తానీ సోషల్ మీడియా ఖాతాలు భారతదేశం గురించి తప్పుడు సమాచారం, అబద్ధాలను వ్యాప్తి చేయడం ప్రారంభించాయి. ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న అనేక పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది. డాన్ న్యూస్, సమా టీవీ వంటి ఛానెల్లు తప్పుదారి పట్టించే కథనాలను పంచుకుంటున్నందున భారతదేశంలో ఆ ఛానల్స్ ను బ్లాక్ చేశారు.
పాకిస్తాన్ నిఘా సంస్థలు నిర్వహిస్తున్న ఆన్లైన్ దాడులు, తప్పుడు సమాచార ప్రచారాలకు వ్యతిరేకంగా పోరాడటానికి భారత ప్రభుత్వం ఇలా చేస్తోంది. భారతదేశంలో సమస్యలను సృష్టించే హానికరమైన కంటెంట్ను పంచుకుంటున్న కొన్ని సోషల్ మీడియా ఖాతాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఈ యూట్యూబ్ ఛానెల్లు ప్రజలను రెచ్చగొట్టడానికి, వర్గాల మధ్య గొడవలను సృష్టించడానికి, భారతదేశం, భారత సైన్యం, ఇతర భద్రతా సంస్థల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి రూపొందించిన కంటెంట్ను పంచుకుంటున్నాయి.
ఇంతలో, భారత సైనిక అధికారులు సమావేశం నుండి వెళ్ళిపోతున్నట్లు చూపించే వీడియోను అనేక యూట్యూబ్ ఛానెల్లు ఆన్లైన్లో షేర్ చేస్తున్నాయి. పాకిస్తాన్తో యుద్ధం చేయలేమని చెప్పి ఆర్మీ జనరల్లు వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. “Indian Army generals have walked out of a meeting, saying,"We are not war against Pakistan." అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
“"Indian Army's Hidden Fear Comes to Light! #Exposed #FearFactor #Trending" అంటూ కూడా కొందరు షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో మార్చి 2025 నాటిది. వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్లను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించినప్పుడు, ఆ వీడియో మార్చి 2025 నాటిదని మేము కనుగొన్నాము. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు మార్చి 2025లో ఈ వీడియోను షేర్ చేశారు.
“ਪਟਿਆਲਾ ਕਰਨਲ Case ਚ DGP ਤੇ Army officer press conference ਵਿਚਾਲੇ ਛੱਡ ਕੇ ਉਠੇ ??? #PunjabiNews #PunjabNews #PunjabPolice #armycolonel #ColonelPride #pressconference #viralreelschallenge #viralvideochallenge #viralchallenge.
అనువదించగా, 'పటియాలా కొలనల్ కేస్ లో, పంజాబ్ పోలీస్ డీజీపి, ఆర్మీ అధికారి ప్రెస్ కాంఫెరెన్స్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు' అనే క్యాప్షన్ తో ఓ ఫేస్బుక్ యూజర్ వీడియోను అప్పట్లోనే షేర్ చేశారు.
మాన్ అమన్ సింగ్ ఛినా అనే X యూజర్ అదే వీడియోను "చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మోహిత్ వాధ్వా తన సీనియర్ అధికారులతో కలిసి పాటియాలా కల్నల్ పై ఒక ప్రకటన చదివి, ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వెళ్లిపోయారు. DGP కూడా ఒక ప్రకటన చదివి వెళ్లిపోయారు కానీ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సైన్యం దేనికి భయపడుతోంది?" అనే క్యాప్షన్తో షేర్ చేశారు.
ప్రెస్ కాన్ఫరెన్స్ విషయం గురించి మరింత శోధించినప్పుడు, ANI న్యూస్ యూట్యూబ్ ఛానల్ షేర్ చేసిన వీడియో మాకు దొరికింది, టైటిల్ “Army demands strict action against accused in Colonel assault case, probe underway” అని ఉంది.
వీడియో వివరణ ప్రకారం మార్చి 13వ తేదీ రాత్రి పాటియాలాలోని ఒక ధాబా వెలుపల భారత సైన్యంలో పనిచేస్తున్న కల్నల్ పుష్పిందర్ సింగ్ బాత్ పై పంజాబ్ పోలీసు ఒకరు దాడి చేశారు. ఆ అధికారిని సివిల్ ఆసుపత్రి నుండి సైనిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కమాండ్ ఆసుపత్రిలోని చండిమందర్లో చికిత్స అందించారు. ఆయన గాయాల నుండి కోలుకుంటున్నారు. ఆర్మీ అధికారి, పోలీసు డీజీపీ కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఈ వీడియో చూపిస్తుంది.
పంజాబ్ పోలీస్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఐపిఎస్, హెడ్ క్వార్టర్ వెస్ట్రన్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మోహిత్ వాధ్వా సంయుక్త విలేకరుల సమావేశంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ పాటియాలాలో పోలీసు అధికారి కల్నల్ పై దాడి చేయడంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారని ఆ నివేదిక తెలియజేస్తుంది.
పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ వాదన ను అబద్దపుది అని తేల్చింది. పాకిస్తాన్ కు చేందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయంటూ తెలిపింది. ఆర్మీ అధికారి, పోలీసు డిజిపి సమావేశం నుండి వెళ్లిపోతున్నట్లు చూపించే వీడియో ఇటీవలిది కాదు. పాకిస్తాన్తో పోరాడటానికి తాము అసమర్థులమని చెప్పలేదు. పంజాబ్ పోలీసు డీజీపీ, సైనిక అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఎటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళిపోతున్నట్లు ఈ విజువల్స్ చూపిస్తాయి. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : వైరల్ వీడియోలో భారత ఆర్మీ జనరల్స్ తాము పాకిస్తాన్ తో యుద్ధం చేయలేమంటూ సమావేశం నుండి వెళ్ళిపోయారు
Claimed By : Youtube Users
Fact Check : Unknown