ఫ్యాక్ట్ చెక్: బుర్జ్ ఖలీఫాపై మిసైల్స్ పడ్డాయంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు

బుర్జ్ ఖలీఫాపై మిసైల్స్ పడ్డాయంటూ జరుగుతున్న వాదనలో

Update: 2026-03-04 08:23 GMT

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సైనిక దాడులు ఉధృతమయ్యాయి. ఈ ఆపరేషన్‌ ఇంకా నాలుగు నుంచి ఐదు వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అవసరమైతే ఇంకా ఎక్కువ కాలం కొనసాగిస్తామని చెప్పారు. దాడులకు ప్రతిగా ఇరాన్, దాని మిత్ర బలగాలు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించాయి. ఖతార్ లోని ఇంధన కేంద్రాలు, సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యాలుగా మారాయి. ఇజ్రాయెల్‌పైనా దాడులు జరిగాయి. ఇరాన్ సుప్రీం నేత ఆలి ఖమేనీ మరణంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.


సౌదీ రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ కు చెందిన రెండు డ్రోన్లు దాడి చేశాయని సౌదీ అధికారులు వెల్లడించారు. స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుని చిన్నపాటి నష్టం జరిగిందన్నారు. కువైట్ లోని అమెరికా రాయబార సముదాయం కూడా లక్ష్యంగా మారింది. సౌదీ అరేబియాలోని రాస్ తానురా చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లు దాడి చేశాయి. రక్షణ వ్యవస్థలు వాటిని కూల్చేశాయని అధికార ప్రతినిధి తెలిపారు.

ఇంతలో బుర్జ్ ఖలీఫా మంటల్లో ఉన్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేము 1800 డ్రోన్లతో బుర్జ్ ఖలీఫాపై దాడి చేశామంటూ కొన్ని పోస్టులు పెట్టారు.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.

బుర్జ్ ఖలీఫాపై మిసైల్స్ పడ్డాయా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మిసైల్స్ కారణంగా బుర్జ్ ఖలీఫాకు నష్టం కలిగిందంటూ ఎలాంటి కథనాలు మాకు లభించలేదు.

అయితే దుబాయ్ నగరంలోని పలు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు మాత్రం నివేదికలు ఉన్నాయి. వాటిని
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు. 

ఇరాన్‌ దాడుల వల్ల దుబాయ్‌లో అత్యంత రద్దీగా ఉండే జబిల్‌ అలీ పోర్టులో భారీగా మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రముఖ బుర్జ్ అల్ అరబ్ హోటల్‌ దెబ్బతిన్నట్లు తెలిపారు. విమానాశ్రయంలోని పలువురు వ్యక్తులు గాయపడినట్లు ఎమిరేట్ మీడియా కార్యాలయం వెల్లడించింది. ఇరాన్‌ ప్రయోగించిన డ్రోన్‌ శిథిలాలు పడడంతో బుర్జ్ అల్ అరబ్ హోటల్ ముందు భాగంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి.

ఇక వైరల్ అవుతున్న వీడియో నిజమా కాదా అని తెలుసుకోడానికి మేము ఏఐ డిటెక్షన్ టూల్స్ ను వినియోగించాం. ఆ రిజల్ట్స్ లో ఈ వీడియో ఏఐ సృష్టి అని తేలింది. హైవ్ మోడరేషన్ టూల్ వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టం చేసింది. 

అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.



 



ఇక ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఈ వీడియోను ఏఐ సృష్టి అని తేల్చాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య దుబాయ్‌పై ఇరాన్ దాడి చేయగా.. బుర్జ్ ఖలీఫా మంటల్లో ఉన్నట్లు చూపించే వీడియో ప్రచారం అవుతోంది. అయితే, ఈ వాదనకు మద్దతు ఇచ్చే ధృవీకరించిన లేదా విశ్వసనీయ నివేదికలు లేవని స్పష్టం చేశారు.



కాబట్టి, ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను ఇరాన్ బుర్జ్ ఖలీఫాపై చేసిన దాడిగా ప్రచారం చేస్తున్నారు.


Claim :  బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్.. వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News