ఫ్యాక్ట్ చెక్: దేశ రాజధాని సరిహద్దుల్లో భద్రతను భారీగా పెంచుతున్నట్లు చూపుతున్న వైరల్ చిత్రం ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు పలు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో రైతుల చర్చలు అసంపూర్తిగా మిగలడంతో 'డిల్లీ చలో' మార్చ్ ను ప్రారంభించారు
farmers protest
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు పలు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో రైతుల చర్చలు అసంపూర్తిగా మిగలడంతో 'డిల్లీ చలో' మార్చ్ ను ప్రారంభించారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) ధర ఇచ్చే చట్టంతో సహా తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా సహా పలు సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఎంఎస్పి చట్టబద్ధమైన హామీ రైతుల నిరసనకు ప్రధాన కారణం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, అలాగే వ్యవసాయ రుణమాఫీ చేయాలని కూడా రైతులు డిమాండ్ చేశారు.
2021లో చోటు చేసుకున్నట్లుగా నిరసనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు అధికారులు న్యూఢిల్లీకి వెళ్లే రహదారులను దిగ్బంధించారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఘజియాబాద్ వద్ద జాతీయ రహదారిని పోలీసులు అడ్డుకున్నారు.
అయితే బారికేడ్ల వెనుక అధికారులు నిలబడి ఉన్న ఫోటో.. జాతీయ రహదారిని పూర్తిగా అడ్డుకున్నట్లు చూపించే చిత్రం X (ట్విట్టర్) లో ప్రచారం అవుతూ ఉంది. ఇది రైతుల నిరసనల కారణంగా పోలీసులు రోడ్డును బ్లాక్ చేశారని అందులో చూపిస్తుంది.
“यदि आप दिल्ली NCR में हैं, ट्रैफिक में फंसे हैं तो अपनी आंखें खोलें और चारों ओर देखें। आप किसानों को सड़क जाम करते हुए नहीं देखेंगे, आप पुलिस को जाम लगाते हुए देखेंगे। सरकार चाहती है
कि आप किसानो को असुविधा के लिए दोषी ठहराए।“ అంటూ హిందీ భాషలో పోస్టులు పెడుతున్నారు.
దాన్ని అనువదించగా.. “మీరు ఢిల్లీ NCR లో ట్రాఫిక్లో ఇరుక్కున్నట్లయితే, మీ కళ్ళు తెరిచి చుట్టూ చూడండి. రైతులు రోడ్లు దిగ్బంధించడం లేదు.. రోడ్లపై పోలీసులు వాహనాలను అడ్డుకుంటూ ఉన్నారు. అసౌకర్యానికి రైతులు కారణం కాదు".
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వైరల్ అవుతున్న చిత్రం ఇటీవలిది కాదు.. ఇది 2021 సంవత్సరంలో జరిగిన రైతుల నిరసన సమయంలో చిత్రీకరించబడింది.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2021లో రైతు నిరసన సందర్భంగా ఆ చిత్రం అనేక మీడియా సంస్థలు ప్రచురించాయని మేము కనుగొన్నాము.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6, 2021న ప్రియాంక గాంధీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
ఫోటో స్టాక్ వెబ్సైట్ అలమీలో “ఘాజీపూర్ బోర్డర్ వద్ద అల్లర్ల నేపథ్యంలో బారికేడ్ల వెనుక భారతీయ పోలీసులు కాపలాగా ఉన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన ఘాజీపూర్ సరిహద్దులో కొనసాగుతుండగా, ఢిల్లీ పోలీసులు రైతులను అడ్డుకోడానికి కాంక్రీట్ గోడలు, ముళ్ల కంచెతో సరిహద్దును మూసివేశారు." అలమీ వెబ్ సైట్ ప్రకారం, ఫోటో ఫిబ్రవరి 3, 2021న తీశారు.
Outlook.com ఫిబ్రవరి 5, 2021న నివేదికను ప్రచురించబడింది. వైరల్ చిత్రాన్ని షేర్ చేసింది. రైతుల నిరసనల కారణంగా ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ల మధ్య ఘజియాపూర్ బోర్డర్ వద్ద అధికార యంత్రాంగం భద్రతను పటిష్టం చేసిందని నివేదిక పేర్కొంది. నిరసనకారుల సంఖ్య పెరగడంతో వారిని అడ్డుకోడానికి పోలీసులు పలు బారికేడ్లు, ప్రధాన ప్రవేశ కేంద్రాలను మూసివేశారు.
ఫిబ్రవరి 3, 2021న ఇండియా టుడేలో ప్రచురించబడిన ఒక కథనంలో కూడా వైరల్ చిత్రాన్ని షేర్ చేశారు.
జాతీయ రహదారిని పోలీసులు అడ్డుకున్నట్లు చూపుతున్న వైరల్ చిత్రం ఇటీవలిది కాదు. ఈ ఫోటోను 2021 సంవత్సరంలో రైతు సంఘాల నిరసన సందర్భంగా తీసినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : The viral image shows security arrangements by the police at the borders of the national capital
Claimed By : Twitter users
Fact Check : Unknown