నేషనల్ టెక్నాలజీ డే.. ఎందుకు నిర్వహిస్తామో తెలుసా..?

ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ టెక్నాలజీ అన్నది ఒక భాగమైపోయింది. ఎన్నో పనులకు టెక్నాలజీనే నమ్ముకుని బతుకుతున్నాం. మన జీవితాలను టెక్నాలజీకి అంకితం చేశామనే అనుకోవాలి.

Update: 2022-05-11 05:11 GMT

ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ టెక్నాలజీ అన్నది ఒక భాగమైపోయింది. ఎన్నో పనులకు టెక్నాలజీనే నమ్ముకుని బతుకుతున్నాం. మన జీవితాలను టెక్నాలజీకి అంకితం చేశామనే అనుకోవాలి..! సాంకేతికత మన జీవితంలో అంతర్భాగంగా ఉండడమే కాకుండా.. ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతోంది. అందుకే నేడు జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం మే 11న భారతదేశం సాంకేతిక పురోగతిని గుర్తు చేసుకుంటూ నేషనల్ టెక్నాలజీ డే ను జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజును కేవలం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మాత్రమే కాకుండా.. ఆలోచనలు, ఆవిష్కరణలు, విజ్ఞాన వ్యాప్తిని ప్రోత్సహించేవారు.. టెక్నాలజీతో ముడిపడిన వారెవరైనా జరుపుకుంటారు.


1998 పోఖ్రాన్ అణు పరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పరీక్షలు భారత సైన్యం.. పోఖ్రాన్ టెస్ట్ రేంజ్‌లో దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఐదు పేలుళ్ల శ్రేణికి సంబంధించింది. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పరీక్షల తర్వాత భారతదేశాన్ని అణు దేశంగా ప్రకటించారు. ఎలైట్ 'న్యూక్లియర్ క్లబ్'లో చేరిన ఆరవ దేశంగా నిలిచింది. కొత్త టెక్నాలజీ అభివృద్ధికి విశేష కృషి చేసిన వారిని సత్కరించడం ద్వారా భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సహకారాన్ని గుర్తించడం, మన జీవితాల్లో సైన్స్, టెక్నాలజీ ఎంత ముఖ్యమో భావితరానికి తెలియజేసేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక అభివృద్ధి బోర్డు ఈ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన వ్యక్తులు, బృందాలను సత్కరిస్తుంది. వారిని గౌరవిస్తూ పతకాలను అందజేస్తుంది.

భారత రాష్ట్రపతి ఈ వేడుకకు హాజరవుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశిష్ట సేవలందించిన సంస్థలు, వ్యక్తులకు అవార్డులను అందజేస్తారు. జాతీయ సాంకేతిక దినోత్సవం ప్రాముఖ్యతను దేశం మొత్తం గుర్తిస్తుంది కాబట్టి భారతదేశం అంతటా అనేక సెమినార్లు, కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
Tags:    

Similar News