ఫ్యాక్ట్ చెక్: బెంగళూరు తొక్కిసలాటలో చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున విరాట్ కోహ్లీ పరిహారం ప్రకటించలేదు

అటువంటి ప్రకటన ఏదీ విరాట్ కోహ్లీ చేయలేదు

Update: 2025-06-09 10:56 GMT

కర్ణాటక రాజధానిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా 11 మంది ప్రాణాలు కోల్పోయిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. విధాన సౌధ దగ్గర జనసమూహం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రభుత్వానికి లేఖ రాశారని, విధాన సౌధలో వేడుకలను కూడా వ్యతిరేకించారని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదించింది.


డీసీపీ (విధాన సౌధ భద్రత) ఎం.ఎన్ కరిబసవన గౌడ జూన్ 4, 2025న సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ (డిపిఎఆర్) ప్రభుత్వ కార్యదర్శికి రాసిన లేఖలో ప్రమాదాల గురించి హెచ్చరించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఆటగాళ్లను సత్కరించడానికి విధాన సౌధ మెట్లపై సన్మాన కార్యక్రమం నిర్వహించడం గురించి డిపిఎఆర్ తన అభిప్రాయం కోరిన తర్వాత ఆయన లేఖ రాసినట్లు పోలీసు శాఖలోని ఒక మూలం తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత RCBకి సన్మాన కార్యక్రమంలో జూన్ 4న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు.

ఇక తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాళ్లను సత్కరించే కార్యక్రమాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్థించారు. “తనకు, క్రికెట్ స్టేడియంతో ఎటువంటి సంబంధం లేదు. ఈ సంఘటన నన్ను బాధపెట్టింది, ఇలా జరగకూడదు” అని ఆయన మైసూరు విమానాశ్రయంలో అన్నారు.

మొదటి మరణం మధ్యాహ్నం 3:50 గంటలకు సంభవించిందని, సాయంత్రం 5:45 గంటలకు మాత్రమే తనకు వివరాలు లభించాయని సిద్ధరామయ్య అన్నారు. విధానసౌధలో జరిగే సన్మాన కార్యక్రమానికి తన హాజరు పరిమితం అని, స్టేడియం ఈవెంట్ లేదా వేడుకలను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పాత్ర పోషించలేదని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానందను బలిపశువుగా చేశారనే ఆరోపణల గురించి మాట్లాడుతూ, కమిషనర్‌ను మాత్రమే సస్పెండ్ చేయలేదని, ఐదుగురు అధికారులను కూడా సస్పెండ్ చేశారని, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మార్చారని అన్నారు. తన రాజకీయ కార్యదర్శి కె.గోవిందరాజ్‌ను తొలగించామని కూడా ఆయన అన్నారు.

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐకాన్ ఆటగాడు విరాట్ కోహ్లీ తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తులకు తన వంతుగా ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ప్రకటించారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.



వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. ఎక్కడా కూడా విరాట్ కోహ్లీ సొంతంగా కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తున్నట్లుగా ప్రకటించలేదు. విరాట్ కోహ్లీ అలాంటి ప్రకటన చేసి ఉండి ఉంటే తప్పనిసరిగా అది వార్తల్లో నిలిచి ఉండేది.

మా కీవర్డ్ సెర్చ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లుగా కథనాలు లభించాయి.

బెంగళూరు స్టేడియంలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గురువారం రూ.10 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘటనపై ఫ్రాంచైజీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలబడటానికి నిబద్ధతను వ్యక్తం చేసింది. "సంఘీభావానికి చిహ్నంగా, మరణించిన పదకొండు కుటుంబాలకు RCB రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది." ఈ సంఘటనలో గాయపడిన అభిమానులకు సహాయం అందించే లక్ష్యంతో RCB కేర్స్ తరపున చొరవ చూపిస్తున్నట్లు RCB యాజమాన్యం ప్రకటించింది.

అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక సోషల్ మీడియా ఖాతాను కూడా మేము పరిశీలించాం. అందులో 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ ప్రకటన జూన్ 5న పోస్టు చేశారు.

జూన్ 5 నుండి ఎలాంటి ట్వీట్ ను రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు చేయలేదు.

విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ సోషల్ మీడియా ఖాతాలను కూడా మేము పరిశీలించాం. ఎక్కడా కూడా విరాట్ కోహ్లీ కోటి రూపాయలు ఒక్కో బాధిత కుటుంబానికి ఇస్తున్నట్లుగా పోస్టులు లభించలేదు.

విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో మే 28, 2025న పోస్టు చేశారు.



తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విరాట్ కోహ్లీ చివరిగా తొక్కిసలాటలో చనిపోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు.



అనుష్క శర్మ ఖాతాలో కూడా అదే పోస్టు మాకు లభించింది.



విరాట్ కోహ్లీ ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లుగా ఎలాంటి సాక్ష్యాలు మాకు లభించలేదు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  బెంగళూరు తొక్కిసలాటలో చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News