బిగ్ బాస్ లో అశ్లీలతపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కేవలం గ్లామర్ చూపిస్తారనే హౌస్ మేట్స్ గా లోపలికి పంపించడమే కాకుండా.. ఎలిమేట్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా వాళ్లను

Update: 2022-09-30 08:09 GMT

బిగ్ బాస్.. తెలుగు వాళ్లకు ఒకప్పుడు బాగా ఆకర్షించిన టీవీ షో..! ఇప్పుడు కనీసం పట్టించుకునే వాళ్లే లేరనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా షోలో అశ్లీలత పెరిగిపోయిందని చాలా మంది చెబుతున్నారు. సీపీఐ నారాయణ వంటి నాయకులు తీవ్రంగా షోను విమర్శించారు. మన సంప్రదాయమే కాదని.. ఇలాంటి షోలను ఎంకరేజ్ చేస్తున్న నాగార్జున మీద కూడా విమర్శలు గుప్పించారు. ఇక షోను ప్రదర్శించకుండా ఆపివేయాలని కేసులు కూడా నమోదు చేశారు.

తాజాగా బిగ్‌బాస్‌ రియాల్టీ షోను బ్యాన్‌ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది శివప్రసాద్‌ రెడ్డి వాదనలు వినిపించారు. టీవీ షోలు ఇండియన్ 'బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్‌) గైడ్‌లైన్స్‌ పాటించడం లేదని అన్నారు. దీనిపై స్పందించడానికి కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు. బిగ్‌బాస్‌లో అశ్లీలతపై ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని తెలిపిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని తెలిపింది. విచారణను అక్టోబర్‌11కు వాయిదా వేసింది.
ఇక ఎలిమినేట్ అయిన వాళ్లు కూడా షోపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం గ్లామర్ చూపిస్తారనే హౌస్ మేట్స్ గా లోపలికి పంపించడమే కాకుండా.. ఎలిమేట్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా వాళ్లను సేవ్ చేస్తుంటారని ఆరోపణలు చేశారు. మూడోవారం నామినేషన్స్‌లో అనూహ్యంగా ఎలిమినేట్ అయిన నేహా చౌదరి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.. కంటెంట్ ఇవ్వని వాళ్లు హౌస్‌లోనే ఉన్నారు. వాళ్ల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ.. వాసంతి దగ్గర నుంచి కంటెంట్ వస్తున్నదే లేదు. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో బ్యూటీగా మాత్రమే ఉంది. గ్లామర్ డాల్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఉంది. పెర్ఫామెన్స్ ఏం లేదని చెప్పుకొచ్చింది.


Tags:    

Similar News