YSRCP : వైసీపీలోకి ఆ నేతలు క్యూ కట్టే ఛాన్స్ ఎంత?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో చేరికలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో చేరికలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాపు నేతలు కొందరు వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం. కూటమి ఫుల్లు అయిపోవడం.. కూటమిలో ఏ పార్టీలో చేరినా తమకు టిక్కెట్ దక్కదన్న భావన కాపు సామాజికవర్గం నేతల్లో బలపడింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమిలో కీలకంగా ఉండటంతో టీడీపీలో ఉన్న కాపు నేతలు కొందరు తమకు పదవులు భవిష్యత్ లో దక్కవన్న అభిప్రాయంలో ఉన్నారు. జనసేన ఎక్కువగా కాపు సామాజికవర్గం ఓటింగ్ బలంగా ఉండే నియోజకవర్గాలనే ఎంచుకుంటుంది. అందులో గెలుపు గుర్రాలను చూడటమే కాకుండా, తమకు అవకాశం దక్కదన్న అభిప్రాయం బలపడింది.
దగ్గరయ్యే నేతలకు...
ప్రధానంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, రాజంపేట ప్రాంతాల్లో ఉన్న బలిజ సామాజికవర్గం నేతలు కూడా తమకు రాజకీయ అవకాశాలు తక్కువగా ఉంటాయని అంచనా వేసుకుని మరీ ఫ్యాన్ పార్టీకి దగ్గరవుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీలోని జిల్లా నాయకులను కలసి తమ చేరికపై జగన్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కోరినట్లు తెలిసింది. అయితే జగన్ చేరికలకు ఇంకా సమయం ఉందని కొంత దాట వేస్తున్నారని అంటున్నారు. తాను ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయబోతున్నానని, పాదయాత్రలోనే నేతలు చేరుతుంటే యాత్రతో పాటు పార్టీకి కూడా హైప్ క్రియేట్ అవుతుందన్న భావన జగన్ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
బేషరతుగానే చేరాలని...
కానీ బేషరతుగానే చేరాలని, ఎలాంటి టిక్కెట్ల విషయంలో మాత్రం గ్యారంటీ ఇవ్వలేమని కూడా చెబుతున్నారని వైసీపీకి చెందిన ఒక సీనియర్ నేత అన్నారు. టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉన్న తమకు జనసేన కూటమిలో ఉన్నంత కాలం తమకు టిక్కెట్ కూడా దక్కడం కష్టమని భావించి వారు వైసీపీ వైపు రావడానికి ఇష్టపడుతున్నారంటున్నారు. కానీ వైసీపీకి కూడా ఎక్కడకక్కడ నియోజకవర్గాల్లో నేతలుండటంతో వారిని కాదని, జగన్ కొత్తగా చేరే వారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఎలా ఇస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే చేరిన నేతలకు మాత్రం పార్టీ ఖచ్చితంగా పదవి ఇస్తుందన్న భరోసా వారిని చేర్చుకునేందుకు జగన్ సిద్ధమయినట్లు చెబుతున్నారు. చూడాలి .. మరి ఏం జరుగుతుందో?