Ys Jagan : రాజకీయాల్లో రాజీ ధోరణి కలసి వస్తుంది బ్రదర్...తగ్గడం తప్పు కాదు సోదరా?

వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మరోసారి పార్టీని గందరగోళంలోకి నెట్టారని పిస్తుంది

Update: 2026-04-03 09:06 GMT

రాజకీయాల్లో ఒక్కోసారి తగ్గడం కూడా అంతే ముఖ్యం. ప్రజా తీర్పును శిరసావహించడమూ అంతే ముఖ్యం. తాను పట్టిన కుందేలుకు అన్నట్లుగా వ్యవహారం ఉంటే నాయకత్వం అనిపించుకోదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో ఇది పూర్తిగా అర్థమవుతుంది. రాజకీయాల్లో వ్యూహం ఎంత ముఖ్యమో, ఆ వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం కూడా అంతే ముఖ్యం. అమరావతి రాజధాని అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన మరోసారి పార్టీని గందరగోళంలోకి నెట్టారని పిస్తుంది. ఒకరకంగా జగన్ చెప్పినదాంట్లో తప్పు లేకపోవచ్చు. రెండు లక్షల కోట్లు రాజధాని నిర్మాణం సాధ్యమైనదేనా? అన్న జగన్ ప్రశ్న సహేతుకమైనదే.

తగ్గితే తప్పేంటి?
అయితే అదే సమయంలో రాజధాని అమరావతిలోనే ఉంచుతూ అక్కడే అభివృద్ధి దశల వారీగా కొనసాగిస్తామని చెబితే కొంతలో కొంత నయంగా ఉండేది. మరొక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చి జగన్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. రాజధాని అమరావతి విషయంలో తగ్గడం ఇష్టం లేకపోతే ఆ ఊసే ఎత్తకుండా సరిపోయేది. అలాగే వైసీపీ ఉభయ సభల్లో రాజధాని అమరావతికి నిధులతో పాటు, ఏపీకి ప్రత్యేక హోదా అని డిమాండ్ చేసి నిరసన తెలియచేయవచ్చు. అంతే తప్ప బిల్లు ఆమోదం పొందుతుందని తెలిసినా వాకౌట్ చేయడం అవివేకం అవుతుంది. దేశంలో ఏ పార్టీ వ్యతిరేకించక పోయినా వైసీపీ వ్యతిరేకించి రాజకీయంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లయింది.
తాము వ్యతిరేకం కాదని...
అమరావతి రాజధానిగా ఉండటానికి తాను వ్యతిరేకం కాదని జగన్ చెప్పినా అది మాత్రం హైలెట్ కాలేదు. గతంలో మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్లిన జగన్, ఇప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి అమరావతికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకోవడం ఒక వ్యూహాత్మక వెనకడుగు కాదు, అది ముందడుగు. రాజధానికి వ్యతిరేకం అనే భారం నుంచి, ఆ ప్రాంత ప్రజల నుంచి ఎదురవుతున్న నిందల నుంచి బయటపడటానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. . రాజధాని మార్పు అనే వివాదాస్పద అంశాన్ని పక్కన పెట్టి, రాజధాని విస్తరణ'అనే సానుకూల నినాదాన్ని జగన్ ఎత్తుకున్నారు. రాజకీయాల్లో రాజీ ధోరణి ఎప్పుడూ మేలు చేస్తుంది. కీడు చెయ్యదన్న విషయం జగన్ గ్రహించాలి. అప్పుడే వైసీపీ బలం పెరుగుతుంది.


Tags:    

Similar News