BJP : విష్ణు కూటమికి కొరకరాని కొయ్యలా మారారా? ఎందుకిలా?

కూటమి ప్రభుత్వంలో విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొరకరాని కొయ్యగా మారారు

Update: 2026-02-10 08:54 GMT

కూటమి ప్రభుత్వంలో విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొరకరాని కొయ్యగా మారారు. ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు కూటమిని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. వరసగా ఆయన ప్రభుత్వానికి, కూటమికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. విష్ణుకుమార్ రాజు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో బీజేపీ నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు 2024 అంటే పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికయ్యారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన రూటు మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడిన విష్ణుకుమార్ రాజు ఇప్పుడు అధికార పక్షంలో ఉంటూ కూడా తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

రుషికొండ ప్యాలెస్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు...
విష్ణుకుమార్ రాజు కొంత ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉన్నందున ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నకామెంట్స్ కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. ఇటీవల రుషికొండ ప్యాలెస్ పై మంత్రి వర్గ ఉప సంఘం తీసుకున్న నిర్ణయాన్ని విష్ణుకుమార్ రాజు తప్పు పట్టారు. దానిని స్టార్ హోటల్ కు ఇస్తే సామాన్యులకు ఎలా ప్రవేశం దొరకుతుందని ఆయన సూటిగానే ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. తర్వాత భోగాపురం ఎయిర్ పోర్టు లో ట్రయల్ రన్ పూర్తయిన సందర్భంగా కూడా విష్ణుకుమార్ రాజు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే కంటే విశాఖ నుంచి విజయవాడకు వందేభార్ రైలులో వెళితే సమయం ఆదాఅవుతుందని చెప్పి ఇబ్బందిలోకి నెట్టారు. రైల్వే మంత్రికి విశాఖ నుంచి విజయవాడకు వందే భారత్ రైళ్లు వేయాలని తాను కోరతానని విష్ణుకుమార్ రాజు చెప్పారు.
గూగుల్ నుంచి దాడుల వరకూ...
ఇక గూగుల్ డేటా సెంటర్ పై కూడా ఆయన వ్యాఖ్యలు కూటమి పార్టీలో కలకలం రేపాయి. గూగుల్ డేటా సెంటర్ వస్తే విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని, పర్యావరణం దెబ్బతింటుందన్న ఆందోళలనను విష్ణుకుమార్ రాజు చేశారు. గూగుల్ డేటా సెంటర్ తీసుకు వచ్చిన ఆనందాన్ని కూటమి నేతల్లో విష్ణు ఆవిరి చేసిపారేశారు. ఇక తాజాగా మాజీ మంత్రులు, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులను కూడా ఖండించారు. అలా ఇళ్ల మీద దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అయితే విష్ణుకుమార్ రాజు పబ్లిక్ పల్స్ మాత్రమే చెబుతున్నానని అంటున్నారు. ప్రజలు అనుకుంటున్నదే తాను అంటున్నానని, ప్రభుత్వం మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తనకు మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తుండ ఉండి వచ్చని కూటమి నేతలు అంటున్నారు.


Tags:    

Similar News