Weather Report : ఈ నెలాఖరు వరకూ వానలే.. ఎల్లో అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంటే ఈ నెలాఖరు వరకూ చల్లటి వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాలను పలుకరించనుంది. ప్రధానంగా సాయంత్రం వేళ చిరుజల్లులు పడే అవకాశముందని కొన్నిచోట్ల మోస్తరు వానలు పడతాయరి, మరికొన్నిచోట్ల వడగళ్లతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిజిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
రానున్న మూడు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశముందని కూడా తెలిపింది. కొన్నిప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని, ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో ఈ జిల్లాల్లో వానలు...
తెలంగాణలోనూ ఈ నెలాఖరు వరకూ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు పడతాయని అధికారులు తెలిపారు. కొన్నిజిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్ లో వానలు పడతాయని చెప్పింది. అలాే కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూల్, వికారాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా చెప్పింది. రైతులు, రైతు కూలీలు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.