Rk Roja : పార్టీకి గుదిబండలా మారుతున్న రోజా
మాజీ మంత్రి ఆర్కే రోజా వంటి వారితో వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది
మాజీ మంత్రి ఆర్కే రోజా వంటి వారితో వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ఇటీవల ఆమె చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై చేసిన వ్యాఖ్యలతో పార్టీకి నష్టమేనంటున్నారు. రోజా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారని, ఆమెను అదుపులో పెట్టాల్సిన పార్టీ నాయకత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తే మరింత డ్యామేజీ కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అనవసర విషయాల్లో వేలుపెట్టడం రోజాకు అలవాటు. సినిమా డైలాగుల్లా రాజకీయనేతలు మాట్లాడితే అవి వికటిస్తాయని అంటున్నారు. పాలు పితకడం వంటి వ్యాఖ్యలతో వైసీపీకి మరింత నష్టం చేకూరిందని అంటున్నారు.
రోజురోజుకూ భారంగా...
వైసీపీకి మాజీ మంత్రి రోజా రోజురోజుకూ భారంగా మారుతున్నారు. నేతల అరెస్ట్ లతో కాస్తో కూస్తో వైసీపీకి సానుభూతి లభిస్తుందని భావిస్తే, రోజా తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో అవి కనపడకుండా పోతున్నాయని, రోజా వ్యాఖ్యలను ఎవరూ హర్షించకపోవడమే కాకుండా ప్రజలను పార్టీకి మరింత దూరం చేసే విధంగా ఉందని అంటున్నారు. రోజా లాంటి నేతల నోళ్లను కొన్నాళ్లపాటు అదుపులో పెట్టకపోతే జగన్ కు వచ్చే ఎన్నికల్లోనూ తీరని నష్టం జరుగుతుందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. కానీ రోజా విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆమె మరింత రెచ్చిపోతున్నారు.
కొన్నాళ్లు దూరంగా ఉన్నా...
ఆర్కే రోజా తొలుత తనను అరెస్ట్ చేస్తారేమోనని భయపడి కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.కానీ తనపై ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో పాటు కూటమి ప్రభుత్వం కూడా చూసీ చూడనట్లు వదిలేయడం వల్ల రోజా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారని అంటున్నారు. అధికార పార్టీ కొద్దో గొప్పో వస్తున్న వ్యతిరికేతను రోజా లాంటి నేతలు తమ మాటలతో కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా జగన్ రోజాను కట్టడి చేయకపోతే వైసీపీకి రానున్న కాలంలో మరింత ఇబ్బందులు తప్పవంటున్నారు.