నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి

Update: 2026-02-08 04:05 GMT

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ఈ రోజు నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సుమారు 12 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే అదనంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు 8 గంటల నుండి 12న సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే శివదీక్ష ఇరుముడి కలిగిన స్వాములకు మాత్రమే శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం విడతల వారీగా ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు నలభై లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతామన్నారు. క్షేత్రంలో పలుచోట్ల వాహనాల పార్కింగ్ సేద తీరేందుకు జర్మన్ షెడ్లు, పార్కింగ్ లో మంచినీరు, మరుగుదొడ్లు, లైటింగ్ అందుబాటులో ఉంచారు. పోయిన ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 13 నుండి 16 వరకు నాలుగు రోజులు భక్తులకు ఉచిత లడ్డు అలాగే 15, 16 రెండు రోజులు వాహనాలు టోల్ గేట్లు లేకుండా ఉచితంగా అనుమతించనున్నారు.

అటవీ మార్గంలో వచ్చే భక్తులకు...
పాదయాత్రగా అటవీ మార్గంలో వచ్చే భక్తులకు భీముని కొలను కైలాసద్వారం నుండి పలుచోట్ల స్వచ్ఛంద సంస్థలచే అన్నదానం, మెడికల్ క్యాంపులు, మంచినీరు, సేద తీరేందుకు షెడ్లు ఏర్పాటు చేశారు.ఆలయంలో ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం క్యూలైన్లులో వేచి వుండే భక్తులకు ప్రతినిత్యం మంచినీరు, పాలు, అల్పాహారం ఏర్పాటు చేయనున్నారు.పాతాళగంగలో భక్తులకు భద్రత కోసం ఘాట్ లలో గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉంటారు. అటవీ మార్గం నుండి వచ్చే భక్తులు సేద తీరడానికి శ్రీశైల క్షేత్రంలో పలుచోట్ల జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపటి నుండి శ్రీస్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు, గ్రామోత్సవం జరగనున్నాయి.అలానే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు రానున్నాయి.ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాలు అందించనున్నారు. మూడు వేల మంది పోలీసులతో భద్రత, డ్రోన్ కెమెరాలతో నిఘా, అలానే ఇతర శాఖలకు సంబంధించి సుమారు 2 వేల మంది సిబ్బందితో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తామని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.


Tags:    

Similar News