కొత్త ఛైర్మన్ వేణు ఆధ్వర్యంలో ముందుకు దూసుకువెళ్తున్న అమెరికా క్రికెట్

భారతదేశంలో జన్మించిన పిసికే జూలై 2023లో బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

Update: 2024-01-09 11:35 GMT

అమెరికాలో క్రికెట్ కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. అమెరికా క్రికెట్ బోర్డుకు కొత్త చైర్మన్ వేణు పిసికే రాకతో ఎన్నో దశాబ్దాల గందరగోళం తర్వాత యునైటెడ్ స్టేట్స్‌లో క్రికెట్ పరిపాలన యంత్రాంగంలో ఓ స్థిరత్వం వచ్చింది.

భారతదేశంలో జన్మించిన పిసికే జూలై 2023లో బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అమెరికాలోని క్రికెట్ వాటాదారుల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. 2018 నుండి బోర్డు సభ్యునిగా ఉన్నారు ఆయన. ఆయనకు క్రికెట్ మీద ఉన్న శ్రద్ధ.. అమెరికాలో క్రికెట్ ను వ్యాప్తి చేయాలనే శ్రద్ధ కారణంగా ఆయన బోర్డు ఛైర్మన్ స్థాయికి ఎదిగారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లో నిర్వహించనుంది. అమెరికాలో టోర్నమెంట్ ను హిట్ చేస్తామనే నమ్మకంతో వేణు ఉన్నారు. “ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్‌ కు కో-హోస్ట్ చేసే అవకాశం లభించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. T20 క్రికెట్ అమెరికన్ క్రీడా సంస్కృతికి బాగా సరిపోతుంది. ప్రపంచ కప్ గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం ఖచ్చితంగా అమెరికాలో క్రికెట్ వ్యాప్తిని పెంచుతుంది. అమెరికాలో క్రికెట్‌ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇదే సరైన, గొప్ప అవకాశం" అని అన్నారు వేణు.
టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించే ముందు, USA అండర్-19 జట్టు 2024లో దక్షిణాఫ్రికాలో జరిగే ICC అండర్ 19 ప్రపంచ కప్‌లో పాల్గొంటుంది. ఇటీవల వేణు అమెరికా జట్టును వెస్టిండీస్ U-19, ట్రినిడాడ్ అండ్ టొబాగో U-23 జట్టుతో వార్మప్ మ్యాచ్‌లు ఆది ప్రపంచ కప్‌కు సిద్ధం చేసేందుకు ట్రినిడాడ్‌కు పంపారు. “ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెట్‌ బోర్డు మాకు భాగస్వామి. మా అండర్-19 ప్రపంచ కప్ సన్నాహాలకు TT మద్దతు ముఖ్యం.. మేము మా సంబంధాలను మెరుగుపరుచుకోడానికి సంతోషంగా ఉన్నాము. ఒకరికొకరు మద్దతునిచ్చేందుకు దీర్ఘకాల సంబంధాల కోసం ఎదురు చూస్తున్నాము." అని ఆయన అన్నారు.
అమెరికన్ క్రికెట్‌ బోర్డుకు సంబంధించిన దాదాపు అందరు వాటాదారులతో వేణు సమావేశమయ్యారు. అమెరికాలో క్రికెట్ వ్యాప్తి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించిన ఆయన.. ఆ లక్ష్యాలను సాధించడానికి వాటాదారుల సహాయం కోసం చూస్తున్నారు. “2023 చివరి నాటికి బోర్డు పాలన, కార్యకలాపాలను స్థిరీకరించడం మా లక్ష్యం. మేము పలు సమస్యలు, ఖాళీలను పరిష్కరించడానికి రాజ్యాంగ సవరణలను పరిశీలిస్తున్నాము. మేము ఐదేళ్ల వ్యూహాలలో భాగంగా (2024-28) దేశంలో క్రికెట్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం, సరళీకృత సభ్యత్వ వ్యవస్థను రూపొందించడం దాదాపు పూర్తి చేసాము. మా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన సంక్లిష్టతలను కూడా పరిష్కరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2024 చివరిలోపు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నామని వేణు తెలిపారు. పురుషులు, మహిళల క్రికెట్ కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యాన్ని సృష్టించాలని అనుకుంటూ ఉన్నామని తెలిపారు.
2028 నుండి 2030 వరకు నిర్దేశించిన దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా అమెరికా పురుషులు, మహిళల జట్లను ICC ర్యాంకింగ్స్‌లో చేర్చాలని భావిస్తున్నట్లు తెలిపారు. ICC ఈవెంట్‌లను హోస్ట్ చేసే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, USAలో క్రికెట్ కు జనాదరణ తీసుకుని వచ్చేందుకు లాభసాటిగా మారేలా చూసేందుకు తగిన ప్రయత్నాలను చేయాలని అనుకుంటున్నట్లు వివరించారు. ఇక దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఐసిసి పూర్తి స్థాయి సభ్య దేశంగా అమెరికా క్రికెట్ ను మార్చాలని.. అంతేకాకుండా యుఎస్ ఒలంపిక్ కమిటీలో సభ్యునిగా కూడా మారాలని అనుకుంటున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News