India Vs Australia T20 : పక్కన పెట్టడం గ్యారంటీ... అయితే ఎవరిని తీసుకుంటారన్నదే?

ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టీ 20లో టీం ఇండియా జాగ్రత్త పడుతుంది. ప్రసిద్ధ్ కృష్ణను నాలుగో మ్యాచ్ కు దూరం పెట్టనుంది

Update: 2023-11-29 13:07 GMT

ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టీ 20లో టీం ఇండియా జాగ్రత్త పడుతుంది. గౌహతిలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో పడింది. అందివవచ్చిన మ్యాచ్ చేజారిపోవడంతో కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రసిద్ధ్ కృష్ణను నాలుగో మ్యాచ్ కు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో దీపక్ చాహర్ కు చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోవడానికి చివరి మూడు ఓవర్లు కారణమని అందరికీ తెలిసిందే.

డెత్ ఓవర్లలో...
దీనిపై ప్రసిద్ధ్ కృష్ణ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సామర్థ్యం లేదని సోషల్ మీడియాలో అనేక మంది కామెంట్స్ పెడుతున్నారు. నిన్నటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ ముందుగానే మన పరం అయి ఉండేది. అలాంటిది ప్రసిద్ధ్ కృష్ణ కారణంగా మ్యాచ్ ను కళ్ల ముందే కోల్పోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. మ్యాక్స్‌వెల్ అప్పటి వరకూ నిలదొక్కుకున్నాడని తెలిసి ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బౌలింగ్ పై విమర్శలు చోటు చేసుకున్నాయి. ఇటు వంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
దీపక్ చాహర్ వస్తాడంటూ...
దీంతో ప్రసిద్ధ్ కృష్ణపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో దీపక్ చాహర్ ను తీసుకోవాలన్న యోచనలో టీం ఉంది. అలాగే ముఖేష్ కుమార్ కూడా అందుబాటులోకి రానున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎవరిని చివరి క్షణంలో ఎంపిక చేస్తారన్నది ఇంకా తేలకపోయినా ప్రసిద్ధ్ కృష్ణ ను తప్పించడం ఖాయమని దాదాపుగా తేలిపోయింది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ నిన్న మ్యాచ్ ను కోల్పోవడానికి బౌలర్లే కారణమన్న ఘాటు విమర్శల నుంచి తప్పించుకోవడానికి నాలుగో టీ 20లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం.


Tags:    

Similar News