MS Dhoni: అభిమానులను టెన్షన్ పెడుతున్న ధోని 'ఫేస్ బుక్ పోస్ట్'

మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే చాలా అరుదు

Update: 2024-03-04 14:32 GMT

మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే చాలా అరుదు. అలాంటిది అతడేమైనా ఓ పోస్ట్ పెట్టాడంటే క్రికెట్ ప్రపంచమంతా అటువైపే చూస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని సోమవారం తన 'కొత్త పాత్ర' గురించి సోషల్ మీడియా పోస్ట్‌ పెట్టాడు. ఈ పోస్ట్ అతని అభిమానులలో సరికొత్త ఊహాగానాలకు దారితీసింది. రాబోయే IPLలో ధోని మ్యాచ్ ఆడుతాడా లేక.. మరేదైనా రోల్ లో కనిపిస్తాడా అనే విషయమై అభిమానులు చర్చిస్తూ ఉన్నారు. "కొత్త సీజన్.. కొత్త 'పాత్ర' కోసం వేచి ఉండలేకపోతున్నాను. చూస్తూ ఉండండి!" అని ధోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 'కొత్త సీజన్' ప్రస్తావన ఇంతకూ IPL 2024 ఎడిషన్‌కు సంబంధించినదా కాదా అన్నది అభిమానులు తెలుసుకోలేకపోతున్నారు.

2024 సీజన్‌లో ధోని తన ఐపీఎల్ జట్టుకు ఆడుతాడా.. లేదా అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మెంటార్‌గా పని చేస్తారంటూ మరికొందరు స్పందిస్తూ ఉన్నారు. 2023లోనే ధోని రిటైర్మెంట్ ఉంటుందని భావించారు.. కానీ అలాంటిదేదీ జరగలేదు. గత సీజన్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది.. ఇక ధోనీ మోకాలి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ధోనీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టడంతో 2024 సీజన్‌లో ధోని ఆడతాడని అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే ఫేస్ బుక్ పోస్ట్ మాత్రం ఊహించని చర్చకు దారితీసింది.


Tags:    

Similar News