India Vs Asustralia T20 : మ్యాచ్‌కు సీనియర్లు దూరం... సిరీస్ సొంతం చేసుకోవడానికి

నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది

Update: 2023-12-01 04:12 GMT

నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఐదో మ్యాచ్‌లో సిరీస్ ఎవరదిన్నది తేలనుంది. ఇప్పటికే భారత్ 2 - 1 ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్ లో భారత్ గెలవగా, మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది. మూడు మ్యాచ్‌లలోనూ రెండు వందలకు పైగానే పరుగులు చేయడం, ఛేదనలోనూ మంచి ఆటను అందరూ చూశారు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం నలువైపులా ఆటగాళ్లు బాదుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా ఉంది.

కొందరిని పక్కన పెట్టి...
ఈరోజు మ్యాచ్ రాయపూర్‌లో జరగనుంది. అయితే భారత్ కొన్ని మార్పులతో ఈ మ్యాచ్ లో దిగే అవకాశాలున్నాయి. ప్రధానంగా మూడో మ్యాచ్ లో డెత్ ఓవర్లలో అత్యధిక పరుగులు సమర్పించిన ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టనున్నారు. అతడి స్థానంలో దీపక్ చాహర్ ను తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే బ్యాటర్లలో కూడా ఒకరిపై వేటు తప్పేట్లు లేదు. తెలుగోడు తిలక్ ను పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్ ను ఈ మ్యాచ్ లోకి తీసుకుంటారని తెలిసింది. వరల్డ్ కప్ లో చూపిన పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా శ్రేయస్ అయ్యర్ ను చివరి రెండు మ్యాచ్ లకు పిలిపించింది.
అందరూ స్వదేశానికి...
ఇక ఆస్ట్రేలియా వరసగా జరుగుతున్న రెండు మ్యాచ్ లకు సీనియర్లు దూరంగా ఉన్నారు. కొందరు సీనియర్ సభ్యులు తమ సొంత దేశానికి వెళ్లారు. మ్యాక్స్‌వెల్, మార్కస్ సోయినిస్, జోష్ ఇంగ్లిస్, అబాట్ ఈ రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేరు. దీంతో ఆసీస్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ ఆసీస్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగా ఉండటంతో తేలిగ్గా తీసుకోవడానికి వీలులేదు. రాయపూర్ లోనే గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మ్యాచ్ చివరకు ఎవరి పరమవుతుందన్నది చూడాలి.
Tags:    

Similar News