చర్చకు నేను రెడీ.. డేట్‌ నువ్వు ఫిక్స్‌ చేయ్‌: మంత్రి జోగి

అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌కు విసిరారు

Update: 2023-06-30 00:36 GMT

చర్చకు నేను రెడీ.. డేట్‌ నువ్వు ఫిక్స్‌ చేయ్‌: మంత్రి జోగి

విజయవాడ : దమ్ము, దైర్యం, చీము, నెత్తురు ఉంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌కు విసిరారు. కుప్పం, టెక్కలి లేదా మరో చోట ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. డేట్‌, టైమ్‌ ఫిక్స్‌ చేయాలన్నారు. గురువారమిక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి.. 1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు తమ పార్టీ మేనిఫెస్టోలో ఏం ప్రస్తావించారో తెలుసా అని టీడీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరినీ ప్రశ్నించారు. పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోను తొలగించడంపై మండిపడ్డారు. గత నాలుగేళ్ల పాలనలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిందని మంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడిన మంత్రి, 44 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం, 64 లక్షల మంది వృద్ధులకు సామాజిక భద్రతా పింఛన్లు, 80 లక్షల మంది మహిళలు, రైతులకు ఆసరా, రైతు భరోసారి, 26 లక్షల మందికి చేయూత పథకాలు అందిస్తున్నారని తెలిపారు. దాదాపు 80 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఆయన చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరువకావడంతో టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదని అందులో భాగంగానే ప్రభుత్వంపై ఇష్టామొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని అన్నారు.

వైసీపీ పాలనలో ఇప్పటి వరకు 31 లక్షల ఇళ్ల స్థలాలను ఇచ్చిందని, అందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉందని జోగి రమేష్ అన్నారు, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లను కేటాయించకుండా న్యాయపరమైన వ్యాజ్యాలను ఎంచుకున్నాడని చంద్రబాబుపై జోగి రమేష్‌ ఫైర్‌ అయ్యారు. అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో పేదల ప్రయోజనాల కోసం దాదాపు 50 వేల ఇళ్లను నిర్మించడంపై టీడీపీ అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ ప్రభుత్వం త్వరలో గృహప్రవేశాలు నిర్వహిస్తుందని చెప్పారు. బొక్క పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి సీఎం జగన్‌ని విమర్శించే హక్కు లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు.

ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ఇల్లు లేదని, దానికి బదులు గెస్ట్ హౌస్‌లలో ఉంటున్నారని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన ఇంటికి తిరిగి వెళతారని చెప్పారు.

Tags:    

Similar News