పిన్నెల్లిని ఓడించే శక్తి వాళ్లిద్దరికీ లేదు : మంత్రి అంబటి

మాచర్లలో పిన్నెల్లిని ఓడించడం తమతరం కాదనే.. ఆయనను, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలను అంతం చేసేందుకు ..

Update: 2022-12-17 11:49 GMT

పల్నాడు జిల్లా మాచర్లలో నిన్నటి నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ పరిస్థితులపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. టీడీపీ నాయకత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ నేరచరిత్రకలిగిన బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించి.. చంద్రబాబు హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించే శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు, బ్రహ్మారెడ్డికి లేవని జోస్యం చెప్పారు.

మాచర్లలో పిన్నెల్లిని ఓడించడం తమతరం కాదనే.. ఆయనను, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలను అంతం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. తాను కన్నెర్ర చేస్తే పల్నాడులో ఒక్కరూ ఉండరు అని చంద్రబాబు పల్నాడులో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడింది నిజం కాదా? అని మంత్రి అంబటి ప్రశ్నించారు. ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో ఉన్నాయని తెలిపారు. బ్రహ్మారెడ్డి నేర చరిత్ర ఏమిటో, అతడు ఎన్ని హత్యలు చేశాడో మాచర్ల ప్రజలకు తెలుసని.. ఎన్ని కుట్రలు చేసినా, హత్యా రాజకీయాలు చేసినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కాలి గోరు కూడా పీకలేరని అంబటి వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News