Ys Sharmila : వామ్మో పోటీ చేస్తామంటూ ఇన్ని అప్లికేషన్లా... షర్మిల అడుగుపెట్టిన వేళావిశేషమేనా?

వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కొంత పుంజుకుంటుంది

Update: 2024-02-10 05:31 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో కొంత ఊపు కనిపిస్తుంది. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కొంత పుంజుకుంటుంది. రాష్ట్ర విభజన చేశారన్న కారణంతో గత రెండు దఫాలుగా పదేళ్ల నుంచి కాంగ్రెెస్ పార్టీ వైపు ప్రజలు చూడను కూడా చూడలేదు. దశాబ్ద కాలం నుంచి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు. పార్లమెంటు సభ్యులుగా కూడా ఏపీ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ పదేళ్ల నుంచి ఎన్నిక కాలేదు. పోటీ చేస్తామంటూ అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో తెలియని ఉత్సాహం వచ్చేసింది.

పీసీసీ చీఫ్ గా...
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలను పార్టీ అధినాయకత్వం అప్పగించింది. గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల పర్యటనకు పెద్దయెత్తున ప్రజలు వస్తున్నారు. ఆమె రాజన్న రచ్చబండ కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలోనే హాజరవుతుండటంతో కొంత కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీకి దగ్గరవుతున్నారు. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన నేతలు నేడు రోడ్డు మీదకు వస్తున్నారంటే కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లే అనుకోవాల్సి ఉంటుంది. అయితే అది ఎంత మేరకు అన్న అంచనాలు మాత్రం ఇప్పుడే చెప్పలేం.
రెండు జాతీయ పార్టీలను...
ఆంధ్రప్రదేశ్ లో రెండు జాతీయ పార్టీలకు అవకాశం ఉండదన్నది వాస్తవం. ఏపీలో వైసీపీ, టీడీపీలు మాత్రమే బలంగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన రెండు సార్లు రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే ప్రజలు వాటిని ఏ మేరకు ఆదరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీ కంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంత మెరుగుపడిందన్నది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొందరు షర్మిల సభలకు వస్తుండటం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
భారీగా దరఖాస్తులు...
కాగా కాంగ్రెస్ గత కొద్ది రోజుల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులను కోరింది. దీనికి కూడా మంచి స్పందనే లభించింది. భారీగా దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం పెరిగింది. ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ముందుకు వస్తున్నారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 793 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు ఆఖరి రోజు కావడంతో మరికొంత మంది అప్పై చేసుకునే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News