ఉన్నట్లుండి కోటీశ్వరులైన హెచ్ డీఎఫ్ సీ ఖాతాదారులు.. చెన్నై, వికారాబాద్ బ్రాంచ్ లలో

ఆదివారం చెన్నైలోని టీ నగర్ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు శాఖ పరిధిలో 100కు పైగా ఖాతాల్లో గరిష్ఠంగా ఒక్కొక్కరి ఖాతాలో రూ.13 కోట్ల చొప్పున

Update: 2022-05-30 07:45 GMT

చెన్నై : బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లో ఉన్నట్టుండి లక్షలు, కోట్ల రూపాయలు జమైతే ఏం చేస్తారు ? ఎవరైనా ఎగిరి గంతేస్తారు కదా. సరిగ్గా చైన్నైలోని టీ నగర్ హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారులు ఇదే పని చేశారు. కానీ ఆ సంతోషం ఎంతోసమయం లేదు. సాంకేతిక లోపం కారణంగా 100 మంది ఖాతాదారుల అకౌంట్లలో కోట్ల రూపాయలు జమైనట్లు గుర్తించిన అధికారులు ఆ నగదును వెనక్కి తీసేసుకున్నారు.

ఆదివారం చెన్నైలోని టీ నగర్ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు శాఖ పరిధిలో 100కు పైగా ఖాతాల్లో గరిష్ఠంగా ఒక్కొక్కరి ఖాతాలో రూ.13 కోట్ల చొప్పున జమ అయింది. ఇది గమనించిన బ్యాంకు.. టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఇలా జరిగినట్టు వివరణ ఇచ్చింది. ఆదివారం సెలవుదినం కావడంతో వేకువ జాము సమయంలో సాఫ్ట్ వేర్ ప్యాచ్ ను అమలు చేస్తున్న తరుణంలో ఈ తప్పిదం చోటు చేసుకున్నట్టు బ్యాంకు తెలిపింది. కాగా.. నగదు జమ అయిన తర్వాత ఏ ఖాతాదారుడైనా ఉపసంహరించుకున్నారా ? అన్న విషయం దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఖాతాలన్నింటినీ తనిఖీ చేసి, అదనపు జమలను బ్యాంకు సాయంత్రానికి వెనక్కి తీసేసుకుంది.
కాగా.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో మరో హెచ్ డీఎఫ్ సీ ఖాతాదారుడికి ఇదే అనుభవం ఎదురైంది. వికారాబాద్ హెచ్ డీఎఫ్ సీ బ్రాంచ్ ఖాతాదారుడైన వెంకట్ రెడ్డి అకౌంట్లో ఒక్కసారిగా 18.52 కోట్ల యాబైరెండు లక్షలరూపాయలు జమైనట్లు మెసేజ్ వచ్చింది. మొబైల్ షాపు నడిపే తన అకౌంట్లో అంతపెద్ద మొత్తం జమ అవ్వడాన్ని చూసి వెంకట్ రెడ్డి షాకయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులకు విషయం చెప్పడంతో.. అతని ఖాతా నుంచి లావాదేవీలను నిలిపివేశారు. దాంతో తాను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వెంకట్ రెడ్డి వాపోయాడు.


Tags:    

Similar News