ఆ మాత్రం మాకు తెలియదా..!

Update: 2016-11-27 09:56 GMT

అశ్వనీదత్‌... ఈ మెగాప్రొడ్యూసర్‌ను నిలువునా ముంచిన చిత్రాలలో మెహర్‌రమేష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన 'శక్తి' ఒకటి. ఈ దెబ్బతో అశ్వనీదత్‌ మరలా నిర్మాతగా కోలుకోలేకపోయాడు. తాజాగా అశ్వనీదత్‌ కుమార్తె స్వప్నదత్‌ ఈ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇలాంటి చిత్రాన్ని అంత భారీ బడ్జెట్‌తో, శక్తికి మించిన భారంతో తీయడం సమంజసమేనా? అని అడిగినప్పుడు.. ఈ చిత్రం కథ మా అందరికీ నచ్చింది. దాంతో భారీ బడ్జెట్‌తో వండర్‌ఫుల్‌గా తీయాలని భావించాం. మరి మేము అంత గ్రాండియర్‌గా తీయడానికి, తారక్‌ సైతం ఆ చిత్రం చేయడానికి ఒప్పుకోవడానికి మేముగానీ, ఎన్టీఆర్‌ కానీ ఫూల్స్‌లం కాదు కదా...! అంటూ సమాధానం ఇచ్చింది.

యండమూరి, సత్యానంద్‌ వంటి ఓ నలుగురైదుగురు అవుట్‌డేటెడ్‌ రచయితలు కూర్చూని, మెహర్‌రమేష్‌ ఇచ్చిన చెత్త కథను వారితో మెరుగులు దిద్దించి, అప్పటికే తన చిత్రాల ద్వారా మంచి టెక్నీషియనే తప్ప క్రియేటివిటీ, స్టోరీని సరిగ్గా హ్యాండిల్‌ చేయలేడని విమర్శలపాలైన మెహర్‌ రమేష్‌ను నమ్మి, అంత బడ్జెట్‌ పెట్టి, ఏదో 'జగదేకవీరుడు.... అతిలోకసుందరి' వంటి చిత్రాన్ని తీస్తున్నామనే భ్రమలో ఉన్నవారిని, చివరకు వైజయంతి మూవీస్‌ బేనర్‌నే మూసివేసే బడ్జెట్‌ కేటాయించిన అశ్వనీదత్‌లను ఏం అనుకోవాలో స్వప్నదత్‌గారే వివరణ ఇస్తే బాగుంటుంది. అందుకే అశ్వనీదత్‌ ప్రస్తుతం మహేష్‌ శరణుకోరి డేట్స్‌కోసం తిరుగుతుంటే, ఆయన కూతుర్లు వేరే బేనర్‌లను స్దాపించి చిన్న చిత్రాలు తీస్తున్నారు. వీటిలో కూడా 'ఎవడే సుబ్రహ్మణ్యం' మంచి చిత్రంగా పేరు తెచ్చుకుందే కానీ వారు తీస్తున్న చిన్నచిత్రాలు కూడా కమర్షియల్‌గా నష్టాలనే మిగిలిస్తున్న సంగతి చూస్తే.. ఇప్పటికీ అశ్వనీదత్‌ అండ్‌ హిజ్‌ డాటర్స్‌ నేటి ట్రెండ్‌కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పకతప్పదు.

Similar News