ఆ దర్శకుడితో కలిసి అసలు వర్క్ చేయను.. విశాల్..!

'మార్క్ ఆంటోని' ప్రమోషన్స్ లో ఉన్న విశాల్.. ఒక దర్శకుడు గురించి చేసిన కామెంట్స్ ఫిలిం వర్గాల్లో చర్చగా మారాయి.

Update: 2023-09-14 11:27 GMT

తమిళ హీరో విశాల్ (Vishal) తన సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. దాదాపు తను నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ అవుతూ వస్తుంటాయి. తాజాగా ఇప్పుడు 'మార్క్ ఆంటోని' (Mark Antony) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న విశాల్.. ఒక దర్శకుడు గురించి చేసిన కామెంట్స్ ఫిలిం వర్గాల్లో చర్చగా మారాయి.

విశాల్ నటించిన ‘డిటెక్టివ్‌’ మూవీ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. తమిళంలో ‘తుప్పరివాలన్‌’ పేరుతో తెరకెక్కింది. తమిళ డైరెక్టర్ మిస్కిన్‌ (Mysskin) తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో సీక్వెల్ తీసుకు వచ్చేందుకు కూడా హీరో, దర్శకుడు సిద్ధమయ్యారు. ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు, అలాగే షూటింగ్ కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో మూవీ మధ్యలో ఆగిపోయింది. డైరెక్టర్ మిస్కిన్‌ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
అందుకు కారణం విశాల్ అండ్ మిస్కిన్‌ మధ్య విబేధాలు రావడమే కారణమట. షూటింగ్ సమయంలో మిస్కిన్‌.. చిత్ర యూనిట్ ని చాలా ఇబ్బందులకు గురి చేశాడట. అతను చేసిన పనులకు విశాల్.. లండన్ ప్లాట్‌ఫామ్స్‌ పై ఒంటరిగా కూర్చొని బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయట. మిస్కిన్‌ చేసిన పనులకు మరో వ్యక్తి అయితే గుండెపోటుతో చనిపోయి ఉండేవాడని, తాను కాబట్టి తట్టుకొని నిలబడ్డాను అని విశాల్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ మళ్ళీ తనతో చేసే అవకాశం వచ్చినా.. అసలు చేయను అంటూ కుండా బద్దలుకొట్టేశాడు.
ఇక 'డిటెక్టివ్-2' సినిమాని తానే డైరెక్ట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. తన సొంత స్క్రీన్ ప్లేతో వచ్చే ఏడాది ఈ సినిమాని పట్టాలు ఎక్కిస్తాను అంటూ వెల్లడించాడు. ఇక మార్క్ ఆంటోని విషయానికి వస్తే..సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతుంది. విశాల్ గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మెప్పించలేకపోయాయి. మరి ఈ మూవీ ఏం చేస్తుందో చూడాలి.


Tags:    

Similar News