విజయవాడలో మీడియాపై రెచ్చిపోయిన సినీ నటి హేమ

మీడియాపై రెచ్చిపోయిన సినీ నటి హేమ

Update: 2022-10-04 04:58 GMT

టాలీవుడ్ ప్రముఖ నటి హేమ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆమెకు ఎంతో కోపం వచ్చింది. దుర్గమ్మను దర్శించుకోలేకపోతానేమోనని అనుకున్నానని, కానీ అమ్మవారి దర్శనం లభించిందని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జనం రద్దీ ఎక్కువగా ఉందని, ప్రొటోకాల్ ఇబ్బంది కూడా ఉందన్న వార్తలు విన్నానని, కానీ చివరి నిమిషంలో దుర్గమ్మ తనను పిలిచిందని అన్నారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హేమ కస్సుమన్నారు. మీరు ఎంతమంది వచ్చారు? అందరూ టికెట్ తీసుకున్నారా? అని ఆ విలేకరి ప్రశ్నించాడు. స్పందించిన హేమ ఆ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి హుండీలో తాను రూ. 10 వేలు వేశానని, రూ. 20 వేల విలువైన చీరను సమర్పించానని పేర్కొన్న హేమ.. టికెట్ గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. టికెట్ తీసుకున్నామని, ప్రొటోకాల్ ప్రకారమే దర్శనానికి వెళ్లామని అన్నారు. దీనిని కూడా వివాదం చేస్తారా? అని మండిపడ్డారు.

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ ఈ రోజు భక్తులకు శ్రీ మహిషాసుర మర్ధని దేవి రూపం లో దర్శనమీయనున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని సేవిస్తే.. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య స్థైర్య, విజయాలు చేకూరుతాయని.. ఇతర అడ్డంకులు తొలిగిపోతాయన్నది భక్తుల నమ్మకం.


Tags:    

Similar News