కీరవాణికి ఇది ఎన్నో జాతీయ అవార్డు..? తెలుగులో ఎంతమంది సంగీత దర్శకులకు..

ఇప్పటివరకు జాతీయ అవార్డు అందుకున్న తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారో తెలుసా..? అలాగే కీరవాణికి ఇది ఎన్నో జాతీయ పురస్కారమో తెలుసా..?

Update: 2023-08-25 04:26 GMT


భారత్ ప్రభుత్వం ఈ ఏడాది 69వ జాతీయ పురస్కారాలను (National Film Awards 2023) ప్రకటించింది. 2021 లో రిలీజ్ అయిన మరియు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలకు గాను ఈ అవార్డులను అందజేశారు. ఇక ఈ పురస్కారంలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఏకంగా 10 నేషనల్ అవార్డులను అందుకోవడమే కాకుండా ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఉత్తమ నటుడు అవార్డు కూడా ఈసారి తెలుగు హీరోకి దక్కడంతో టాలీవుడ్ ఫుల్ జోష్ లో ఉంది.

కాగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ క్యాటగిరీలో తెలుగు సినిమా.. రెండేళ్లలో వరుస అవార్డులను అందుకొని సంచలనం సృష్టించింది. గత ఏడాది థమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డుని అందుకోగా.. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఏకంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. RRR సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినందుకు ఎం ఎం కీరవాణి (M M Keeravani), పుష్ప సినిమాకు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చినందుకు దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) అవార్డులను అందుకున్నారు.

అయితే ఇప్పటివరకు జాతీయ అవార్డు అందుకున్న తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారో తెలుసా..? అలాగే కీరవాణికి ఇది ఎన్నో జాతీయ పురస్కారమో తెలుసా..? 1967 నుంచి ఈ అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టగా.. ఇప్పటివరకు మొత్తం 10 మంది తెలుగు సంగీత దర్శకులు నేషనల్ అవార్డుని అందుకున్నారు. మొదటిసారి 1979లో 'కె.వి.మహదేవన్' బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని గెలుచుకున్నారు. 'శంకరాభరణం' సినిమాకు గాను మహదేవన్ ఈ పురస్కారం అందుకున్నారు.

ఆ తరువాత 1982లో 'మేఘసందేశం' సినిమాకు 'రమేష్ నాయుడు' అవార్డుని గెలుచుకోగా, నెక్స్ట్ ఇయర్ లోనే మరో అవార్డు తెలుగు సినిమాకు వరించింది. 'సాగర సంగమం' చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 'ఇళయరాజా' అవార్డుని అందుకున్నారు. మళ్ళీ 5 ఏళ్ళ తరువాత ఇళయరాజానే టాలీవుడ్ కి నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టారు. 1988లో 'రుద్రవీణ' మూవీ సంగీతానికి జాతీయ పురస్కారం అందింది.

1997లో 'అన్నమయ్య' సినిమాకు గాను 'ఎం ఎం కీరవాణి' మొదటి నేషనల్ అవార్డుని అందుకున్నారు. ఆ తరువాత మళ్ళీ ఈ ఏడాది RRR కు అందుకున్నారు. మొత్తం మీద కీరవాణి రెండు నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక 2004లో 'స్వరాభిషేకం' చిత్రానికి 'విద్యాసాగర్', 2013లో 'నా బంగారు తల్లి' మూవీకి 'శంతను మొయిత్రా', 2020లో 'అల వైకుంఠపురములో' సినిమాకి 'థమన్' జాతీయ పురస్కారాలు అందుకోగా.. ఈ ఏడాది దేవిశ్రీప్రసాద్ మొదటిసారి నేషనల్ అవార్డుని అందుకున్నాడు.


Tags:    

Similar News