ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి అలా అనేశారేంటో..!

ఆ విషయంలో స్పష్టత వచ్చిన తరువాతనే ఈ రీమేక్ ను మొదలుపెట్టడం జరిగింది.

Update: 2023-08-07 02:56 GMT

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళాశంకర్' సినిమా ఆగస్టు 11వ తేదీన థియేటర్లకు రానుంది. ప్రీ రిలీజ్ ఈవెంటులో చిరంజీవి మాట్లాడుతూ .. ఈ సినిమా చేసేటప్పుడు ఎప్పుడో వచ్చిన 'వేదాళం' రీమేక్ ఇప్పుడు చేయడం అవసరమా? అని చాలామంది అడిగారు. మంచి కంటెంట్ ఉన్నప్పుడు రీమేక్ చేయడం వలన తప్పేముంది? పైగా 'వేదాళం' సినిమా ఏ ఫ్లాట్ ఫామ్ పై లేదు. ఆ విషయంలో స్పష్టత వచ్చిన తరువాతనే ఈ రీమేక్ ను మొదలుపెట్టడం జరిగింది. ఈ కథ నాకు నచ్చడం వలన .. మెహర్ రమేశ్ టాలెంట్ పై నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగిందని చెప్పారు. నేను చిన్న చిన్న వేషాలు వేస్తూ నా కెరియర్ ను మొదలుపెట్టాను. అలాంటి నేను ఈ రోజున ఈ స్థాయికి .. ఈ స్థానానికి చేరుకోవడానికి కారణం ప్రేక్షకులే. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన డబ్బుతోనే నిర్మాతలు సినిమాలు మొదలుపెట్టేవారు. ప్రేక్షకులు నాపై చూపుతున్న అభిమానం వాళ్లను ప్రభావితం చేసింది. దాంతో వాళ్లు నా పేరును నిర్మాతలకు సూచించేవారని అన్నారు. చిరంజీవి అనే కొత్త కుర్రాడు డాన్సులు, ఫైట్లు, కామెడీ బాగా చేస్తున్నాడు, అతని సినిమాలను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు .. అతనితో సినిమాలు చేయండి అని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. అలా ప్రేక్షకులే నన్ను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చారని అన్నారు.

ఖైదీ నెంబర్‌ 150 సినిమాలో చెప్పిన డైలాగ్‌లా ‘నాకు నచ్చితేనే చేస్తాను.. నాకు నచ్చితేనే చూస్తాను..’ అనే విధంగా.. ఈ సినిమా నచ్చే చేశానని, ఈ సినిమా మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చుతుందని, మీ నుంచి మంచి మార్కులు ఈ సినిమా సంపాదించుకుంటుందని భావిస్తున్నానన్నారు. కొన్ని సినిమాల్లో నటిస్తుంటే ఈ సినిమా ఎలాగొస్తుందో, అని షూటింగ్‌ టైం టెన్షన్‌ పడుతుంటాం.. కానీ.. భోళా శంకర్‌ సినిమాకు అలాంటి ఏ టెన్షన్‌ మాకు రాలేదు. ఎందుకంటే.. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయిపోయిందనే ఫీలింగ్‌ వచ్చేసిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News