Israel - Iran War :ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు… గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతిదాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌మీడియాలో చేసిన పోస్టులో ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు

Update: 2026-03-31 04:42 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌మీడియాలో చేసిన పోస్టులో ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధం ముగించే ఒప్పందం త్వరలో కుదరకపోతే ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలు, చమురు బావులు, ఖార్గ్‌ దీవి చమురు ఎగుమతి కేంద్రం, అవసరమైతే తాగునీరు అందించే ఉప్పునీరు శుద్ధి కేంద్రాలపై కూడా దాడులు విస్తరిస్తామని పేర్కొన్నారు. హోర్ముజ్‌ జలసంధి వెంటనే తెరవాలని, లేకపోతే సైనిక చర్యలు పెంచుతామని చెప్పారు. ఇరాన్‌ కూడా గల్ఫ్‌ దేశాలపై దాడులు కొనసాగించింది. కువైట్‌లోని నీరు–విద్యుత్‌ కేంద్రంపై క్షిపణి దాడి జరిగింది. ఒక కార్మికుడు మరణించగా, పది మంది సైనికులు గాయపడ్డారని కువైట్‌ వార్తా సంస్థ తెలిపింది. దుబాయ్‌ సముద్ర జలాల్లో కువైట్‌కు చెందిన చమురు ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి జరగడంతో అగ్ని చెలరేగింది. అదుపు చర్యలు కొనసాగుతున్నాయని దుబాయ్‌ మీడియా కార్యాలయం వెల్లడించింది.

మరో విడత దాడులు...
ఇజ్రాయెల్‌, అమెరికా మరో విడత దాడులు ఇరాన్‌పై ప్రారంభించాయి. రాజధాని టెహ్రాన్‌ పరిసరాల్లో పేలుళ్లు వినిపించాయి. ఉత్తరంలోని తబ్రిజ్‌లోని పెట్రోకెమికల్‌ కేంద్రానికి గాలి దాడుల్లో నష్టం వాటిల్లినట్లు ఇరాన్‌ మీడియా తెలిపింది. ట్రంప్‌ ఒకవైపు చర్చలు పురోగమిస్తున్నాయని చెబుతూనే, మరోవైపు సైనిక బెదిరింపులు పెంచుతున్నారు. ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు ఇచ్చిన వ్యాఖ్యల్లో ఖార్గ్‌ దీవిని అమెరికా సైన్యం స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కూడా సూచించారు. న్యూయార్క్‌ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాగర్‌ ఖలిబాఫ్‌తో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు. ట్రంప్‌ పరిపాలన 15 అంశాలతో కూడిన ప్రతిపాదన పంపిందని, అవి అసంబద్ధమైనవని తెలిపారు.
చమురు రవాణాపై...
టెహ్రాన్‌ సమీపంలోని కరాజ్‌లో నివసిస్తున్న 22 ఏళ్ల యువకుడు రాత్రివేళ సమీప దాడుల తర్వాత గంటలపాటు విద్యుత్‌ నిలిచిపోయిందని చెప్పాడు. “విద్యుత్‌ కేంద్రాలపై దాడి చేస్తే ఇక మాకు కరెంట్‌ ఉండదేమోనని భయపడ్డాను” అని ఆందోళన వ్యక్తం చేశాడు.హోర్ముజ్‌ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం. శాంతికాలంలో ప్రపంచ చమురులో ఐదో వంతు ఈ మార్గం గుండా వెళ్తుంది. ఇలాంటి మౌలిక వసతులపై దాడులు అంతర్జాతీయ యుద్ధ చట్టాల ప్రకారం తీవ్రమైన అంశమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.ఇజ్రాయెల్‌లో ప్రధాన అణు పరిశోధన కేంద్రం సమీపంలో ఉదయం సైరన్లు మోగాయి. యెమెన్‌ నుంచి ప్రయోగించిన రెండు డ్రోన్లను ఇజ్రాయెల్‌ సైన్యం కూల్చివేసినట్లు తెలిపింది. సౌదీ అరేబియాలో చమురు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న ఐదు క్షిపణులను అడ్డుకున్నారు. యూఏఈ గగనతలంలో క్షిపణిని తిప్పికొట్టగా ఆకాశంలో అగ్నిగోళం కనిపించింది.
లెబనాన్ లో పేలుడు...
లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలైన యునిఫిల్‌ కేంద్రం సమీపంలో పేలుడు సంభవించి ముగ్గురు శాంతి సిబ్బంది మరణించారు. వీరు ఇండోనేషియా సైన్యానికి చెందినవారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ ఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించేందుకు భద్రతామండలి సిద్ధమైంది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లో 19 మంది మృతి చెందినట్లు సమాచారం. గల్ఫ్‌ దేశాలు, వెస్ట్‌బ్యాంక్‌లో కలిపి రెండు డజన్ల మంది, లెబనాన్‌లో 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది లక్షలకు పైగా ప్రజలు అక్కడి నుంచి తరలివెళ్లారు. లెబనాన్‌లో పది మంది ఇజ్రాయెల్‌ సైనికులు, ఈ యుద్ధంలో 13 మంది అమెరికా సైనికులు మరణించారు.ఇరాన్‌ శక్తి వనరులపై దాడులు, హోర్ముజ్‌ జలసంధి నియంత్రణతో ప్రపంచ చమురు, వాయువు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర సోమవారం 115 డాలర్ల వద్ద కొనసాగింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 60 శాతం పెరిగింది.


Tags:    

Similar News